హైదరాబాద్ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్నారు. నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చైర్మన్, సభాపతి సతీసమేతంగా టీకాను వేయించుకున్నారు. వీరు మార్చి 3వ తేదీన వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. కరోన సెకండ్ వేవ్ చాలా భయంకరంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్కు లేకుండా ఎవరు కుడా బయటకు రావొద్దన్నారు.
ప్రజలు కరోనా వ్యాక్సిన్ విషయంలో అపోహలకు పోవద్దన్నారు. వ్యాక్సిన్ వేసుకోవడం అన్ని విధాలుగా శ్రేయస్కరమని తెలిపారు. తాము వాక్సిన్ తీసుకున్నట్లు ఎలాంటి దుష్ప్రభావాలు లేవన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువగా ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్, సబ్బుతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిమ్స్ డైరెక్టర్ డా. మనోహర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు వ్యాక్సిన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.