ఆరేండ్లలో 513 మంది ఎంపిక
మంత్రి కొప్పుల ప్రత్యేక అభినందన
హైదరాబాద్, ఫిబ్రవరి 7 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరంగా మారాయి. నాణ్యమైన విద్యను అందిపుచ్చుకొని నిరుపేద విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. ఇటీవల ముగిసిన నీట్ తొలివిడత కౌన్సెలింగ్లో ఏకంగా 190 మంది గురుకుల విద్యార్థులు మెడికల్ సీట్లను కైవసం చేసుకొని మరోసారి ప్రభుత్వ విద్యాభివృద్ధి కృషిని ఎలుగెత్తి చాటారు. ఈ సంవత్సరం ఏకంగా 240 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 65 మంది వివిధ రిజర్వేషన్ క్యాటగిరీల్లో ర్యాంకులను సొంతం చేసుకున్నారు. నీట్ మొదటి విడత కౌన్సెలింగ్ ఇటీవల నిర్వహించగా.. అందులో 190 మంది గురుకుల విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు పొందారు. గడిచిన ఆరేండ్లలో మొత్తం 513 మంది విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించడం విశేషం. ఎంబీబీఎస్ సీట్లు పొందిన విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఉచిత శిక్షణ వల్లే..
మా అమ్మ కూలీ. నాన్న పారిశుద్ధ్య కార్మికుడు. డాక్టర్ కావాలనేది నా చిన్ననాటి కల. గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చేరడం నా జీవితంలో ఒక గొప్ప మలుపు. అక్కడి టీచర్లు మాకు కార్పొరేట్ స్థాయి విద్యతోపాటు, శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వం కల్పించిన అవకాశం వల్లే నేను నీట్లో ర్యాంకును సాధించా. హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా. – శాని, గౌలిదొడ్డి కళాశాల
టీచర్ల శిక్షణ వల్లే నీట్ వరకు..
మాది నాగర్కర్నూల్ జిల్లా లింగోటం. నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. గౌలిదొడ్డి కాలేజీలో చేరడం నా అదృష్టం. తెలంగాణ ప్రభుత్వ సహకారం, టీచర్ల శిక్షణ వల్లే నీట్లో ఎస్సీ క్యాటగిరీలో 3287 ర్యాంకు సాధించా. కాకతీయ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది.
– నేహా, 499 మార్కులు
ప్రభుత్వానికి రుణపడి ఉంటా..
గౌలిదొడ్డి గురుకుల కాలేజీలో కార్పొరేట్ స్థాయి శిక్షణతో నీట్లో 559 మార్కులు సాధించా. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ప్రభుత్వానికి రుణపడి ఉంటా.
– స్పందన, గౌలిదొడ్డి కాలేజీ