పాపన్నపేట, సెప్టెంబర్ 29: బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరిచూపూ మళ్లేది ఒక పువ్వుమీదికే.. తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకొని తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపించే ఆ పువ్వు ‘గునుగు పువ్వు’. తెలతెలవారుతుండగా మంచుబింధువులను మోస్తూ భానుడి లేలేత కిరణాలకు సింగిడి రంగులను ప్రతిబించించే గునుగు పువ్వు అంటే తెలంగాణలో తెలియనివారు ఉండరు. దసరా నవరాత్రుల్లో 9 రోజులపాటు తెలంగాణలో ఏ వీధిలో చూసినా గునుగుపూల దిబ్బలే దర్శనమిస్తాయి. ముఖ్యంగా ఒకప్పుడు గ్రామాల్లో గునుగు పువ్వుకే రకరకాల రంగులు అద్ది బతుకమ్మలు పేర్చేవారు. నాడు ఊరు దాటగానే వయ్యారంగా ఊగుతూ పలకరించిన గునుగు పూలు.. నేడు కిలోమీటర్ల దూరం తిరిగి వెదికినా కనిపించటంలేదు. అందుకు కారణం రాష్ట్రంలో బీడుభూములు లేకపోవటమే..
అన్నీ పంటపొలాలే..
గునుగు పెరగాలంటే బీడు భూములు కావాలి. గతంలో సజ్జ, జొన్న, ఆముదం పంటలు వేస్తే.. అందులో అసలు పంటలకంటే గునుగే ఎక్కువ పెరిగేది. నీరు అధికంగా ఉన్నచోట గునుగు పెరగదు. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత సంకల్పంతో రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన 95 శాతం భూమి నేడు పంటపొలంగా మారింది. కాళేశ్వరం వంటి అద్భుత ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తుండటంతో పుష్కలమైన నీటి వసతి ఏర్పడింది. రైతులు వరి, పత్తి వంటి పంటలే వేస్తుండటంతో చూద్ధామన్నా బీడు భూములు కనిపించటంలేదు. దీంతో గునుగు పువ్వు కనిపించటమే గగనమైంది. బతుకమ్మలు పేర్చేందుకు గునుగు పూలకోసం ఊర్లకు ఊర్లు దాటి పోవాల్సి వస్తున్నది. మెదక్ జిల్లా వాసులైతే రాష్ట్రమే దాటిపోయి గునుగు పూల మోపులు తెచ్చుకొంటున్నారు. మెదక్ జిల్లా వరప్రదాయినిగా ఉన్న సింగూరు ప్రాజెక్టు నీటిని ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ వాసులకు తాగునీటి కోసం అందించేవారు. ప్రస్తుతం ఆ నీటిని మెదక్ జిల్లాకే అందిస్తుండటంతోపాటు కాళేశ్వరం నీరు సైతం మెతుకు సీమను తడుపుతున్నది. దీంతో ఎక్కడ చూసినా వరి పొలాలే దర్శనమిస్తున్నాయి. బీడుభూములు కనుమరుగయ్యాయి. గునుగు పువ్వు దొరక్కపోవటంతో జిల్లాలోని పాపన్నపేట మండల పరిధిలోని ముద్దాపూర్, రామతీర్థం, మిన్పూర్ తదితర ప్రాంతాల వారు 100 కిలోమీటర్ల దూరంలోని కర్ణాటకలోగల బీదర్ సమీపానికి వెళ్లి పువ్వు తీసుకొస్తున్నారు. దీనిని బట్టే తెలంగాణలో వచ్చిన మార్పేమిటో అర్థమవుతున్నది.