న్యూఢిల్లీ, జూలై 13: పలు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గుజరాత్లో గత 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారని అధికారులు బుధవారం వెల్లడించారు. వీరిలో తొమ్మిది మంది నీటమునిగి మృత్యువాత చెందారు. ఇప్పటి వరకు 31 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాజ్కోట్ జిల్లాలోని న్యారీ డ్యామ్ నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరింది. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో మంగళవారం వరద నీటిలో ఓ ఎస్యూవీ వాహనం కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, పలువురి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మొత్తంగా 24 గంటల్లో రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. పాల్ఘర్, నాసిక్, పుణె, రత్నగిరి గురువారం వరకు రెడ్అలర్ట్ జారీచేశారు. ఒడిశాలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గజపతి జిల్లాలోని ఓ గ్రామంలో కొండచరియలు విరిగిపడటంతో 10 ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఢిల్లీలో బుధవారం మోస్తరు వానలు పడ్డాయి. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది.
‘కాబోయే నా భార్య కోప్పడుతుందేమో’..!
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో వర్షాలతో పాటు బద్రీనాథ్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో కర్ణప్రయాగ్ వద్ద జాతీయ రహదారి ధ్వంసమైంది. దీంతో ఓ పెండ్లి కుమారుడి వాహనం ట్రాఫిక్లో రెండు గంటలకు పైగా నిలిచిపోయింది. దీంతో వివాహ సమయానికి ఆలస్యంగా వెళ్తే ‘వధువు కోపం తెచ్చుకుంటుంది’ అంటూ శుభం చౌదరి ఒకింత ఆందోళనగా మరోవైపు సిగ్గుపడుతూ అన్నారు.