కరెంటు కోతలతో విసిగిన ఓ రైతు
బీజేపీ పాలిత కర్ణాటకలో ఘటన
బెంగళూరు, జూన్ 4: బీజేపీ పాలిత కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా మంగోటే గ్రామంలో హనుమంతప్ప అనే రైతు కుటుంబం జీవనం సాగిస్తున్నది. అసలే ఆ ఊరిలో కరెంటు కోతలు. అందులోనూ హనుమంతప్ప ఇంటికి కేవలం 3-4 గంటలే విద్యుత్తు సరఫరా అయ్యేది. దీంతో హనుమంతప్ప తమ సమస్యను విద్యుత్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. ఆఫీసర్లు పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి మొరపెట్టుకొన్నాడు. ఫలితం లేకుండా పోయింది.
ఒకరోజు మంగళూరు ఎలక్ట్రిసిటీ సైప్లె కంపెనీ లిమిటెడ్ (ఎంఈఎస్సీవోఎం) సీనియర్ అధికారికి ఫోన్ చేసి సమస్య విన్నవించాడు. దీనికి ఆ అధికారి వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘ఎంఈఎస్సీవోఎం ఆఫీసుకు వెళ్లి మసాలాలను గ్రైండ్ చేసుకో. ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకో’ అని ఉచిత సలహా ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. దీంతో చేసేదేమీ లేక హనుమంతప్ప రోజూ మసాలా పొట్లాలు, మిక్సీ, ఫోన్లను తీసుకెళ్లి కరెంట్ ఆఫీసులో ఛార్జింగ్ పెట్టుకోవడం ప్రారంభించాడు. ఇలా ఏకంగా 10 నెలల నుంచి దీన్ని అమలు చేస్తున్నాడు. ఈ విషయం సోషల్మీడియా ద్వారా వైరల్గా మారింది. దీంతో హనుమంతప్పను ఆఫీసులోకి అనుమతించిన పది మంది సిబ్బందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆఫీసుకు రావొద్దని హనుమంతప్పను హెచ్చరించారు. అయితే, అతని కరెంటు సమస్యను మాత్రం తీర్చలేదు.