గుజరాత్ వాసిని అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : సోలార్ మాడ్యూల్స్ సరఫరా చేస్తానంటూ నగరానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.8.7 కోట్లు కాజేసిన గుజరాత్ వాసిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. సూరత్లో నివాసముండే ఐలేశ్ షా, సిద్ది వినాయక సోలార్ పేరుతో ఓ సంస్థను స్థాపించి, సోలార్ పరికరాలు, ప్రాజెక్ట్లకు సంబంధించిన వ్యవహారాలు చూసే ఏజెంట్గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో నగరానికి చెందిన ఓ సంస్థ యజమానితో పరిచయం ఏర్పడింది. నగరానికి చెందిన సంస్థకు జింకో సోలార్ మాడ్యూల్స్ 5580 యూనిట్లకు సంబంధించినవి పంపించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా నగరానికి చెందిన వ్యాపారి రూ.8.7 కోట్లు ఐలేశ్షాకు బ్యాంకు ద్వారా పంపించాడు. తన బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బును బినామీ ఖాతాలకు బదిలీ చేసుకొని ఐలేశ్ తప్పించుకు తిరుగుతున్నాడు. పక్కా ప్లాన్తో తమను ఐలేశ్ మోసం చేశాడని గుర్తించిన నగరానికి చెందిన సంస్థ ప్రతినిధులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని ఏసీపీ హరికృష్ణ నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరిపింది. నిందితుడు ముంబైలో ఉన్నట్లు గుర్తించి, అక్కడకు వెళ్లి పట్టుకొని నగరానికి తీసుకువచ్చారు. అతడి వద్ద నుంచి రూ.38 లక్షల నగదు స్వాధీనం చేసుకోగా, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.8 కోట్లు సీజ్ చేశారు. ఈ మేరకు నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.
రుణం చెల్లించినా వేధింపులు
హిమాయత్నగర్, జూలై 22 : లోన్ తీసుకొని తిరిగి చెల్లించినా.. నగదు రాలేదని వేధింపులకు గురిచేస్తున్నారని ఓ యువకుడు శుక్రవారం నారాయణగూడ పోలీసులను ఆశ్రయించాడు. సీఐ ఆర్.శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణగూడ వైఎంసీఏ ప్రాంతంలో నివాసముండే విజయ్కుమార్ ఇటీవల గూగుల్ ప్లే స్టోర్లో రుణ యాప్ను డౌన్లోడ్ చేసుకొని తన వివరాలను పొందుపరిచి రూ.7,590 లోన్ తీసుకున్నాడు. వడ్డీతో సహా తీసుకున్న నగదును చెల్లించాడు. వేర్వేరు సెల్ఫోన్ నంబర్ల నుంచి ఫోన్ చేసి వేధించడం మొదలు పెట్టడంతో మరో రూ.3,700 పంపించాడు. మరిన్ని డబ్బులు పంపించాలని ఒత్తిడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు విజయ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జూనియర్ లైన్మన్ పరీక్షలో.. పాస్ చేయిస్తామని రూ.లక్ష వసూలు
ముగ్గురు విద్యుత్ శాఖ సిబ్బంది రిమాండ్
గోల్నాక, జూలై 22 : ఇటీవల నిర్వహించిన విద్యుత్ శాఖ జూనియర్ లైన్మన్ పరీక్షలో పాస్ చేయిస్తామని ఓ అభ్యర్థి నుంచి డబ్బులు వసూలు చేసిన అదే శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులను అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ పి.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ విద్యుత్ శాఖ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో జూనియర్ లైన్మన్ ఉద్యోగాల కోసం ఈనెల 17న పరీక్షలు నిర్వహించారు. విద్యుత్ శాఖ ఏడీగా విధులు నిర్వహిస్తున్న అంబర్పేటకు చెందిన ఫిరోజ్ఖాన్(46), కర్మన్ఘాట్కు చెందిన లైన్మన్లు దశరథ్, శ్రీనివాస్ ముగ్గురు కలిసి కర్తాల్కు చెందిన అభ్యర్థి లోక్యానాయక్తో పరీక్షల్లో పాస్ చేయిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు గాను రూ.లక్ష వసూలు చేశారు. అయితే లోక్యానాయక్కు వారు సహకరించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు.