ముంబై : దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తున్నది. గత కొన్నిరోజులుగా కొత్త కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పరిస్థితి అదుపులోకి రానిపక్షంలో ముంబైలో మళ్లీ లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయాన్ని ముంబై గార్డియన్ మినిస్టర్ అస్లాం షేక్ కూడా ధ్రువీకరించడమే కాకుండా.. మరో 8 రోజులు పరిస్థితులను సమీక్షించి వ్యాప్తి అదుపులో లేనిపక్షంలో పాక్షిక లాక్డౌన్ విధిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మళ్లీ లాక్డౌన్ విధించనున్నట్లు వార్తలు రావడంతో ముంబైలోని అన్ని ప్రాంతాల్లో కిరాణా దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరి నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నారు.
ముంబైలోని పలు ప్రాంతాల్లో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. గత వారం రోజులుగా ముంబై వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇక వైరస్ అంతం అయిపోయిందని భావిస్తున్న తరుణంలో మళ్లీ జడలు విప్పడంతో ప్రజలు, అధికారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 142 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్యల 11.141 కి చేరుకున్నది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రెండు రోజుల క్రితం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణం నుంచి దాదాపు 2,746 శాంపిల్స్ పరీక్షలకు తీసుకెళ్లగా.. వాటిలో 36 పాజిటివ్గా తేలాయి. కాగా, ఒక్క ముంబై విమానాశ్రయంలోనే గత ఏడాది సెప్టెంబర్ నుంచి 2021 ఫిబ్రవరి నెలాఖరు వరకు 1480 కొత్త కేసులు రికార్డయ్యాయి. ముంబై విమానాశ్రయంలో ఇప్పటివరకు 2.20 లక్షల మంది కరోనా పరీక్షలు జరిపారు. గత నెల ఆరో తేదీ నుంచి విమానాశ్రయం ప్రాంగణంలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షాకేంద్రం అందుబాటులోకి వచ్చింది. ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో తిరిగి కరోనా వ్యాప్తి చెందడం పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే విచారం వ్యక్తం చేశారు. గత సెప్టెంబర్లో కంటే ఎక్కువగా కొన్నిప్రాంతాల్లో కేసులు రావడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచనేదీ లేదన్న ముఖ్యమంత్రి.. మజ్బూరీ అయితే మాత్రం ఏంచేయలేం కదా? అని చెప్పారు. ప్రజలు అవసరం ఉంటేనే ఇండ్ల నుంచి బయటకు రావాలని, కరోనా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విన్నవిస్తూనే కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలు విధిగా మాస్కులు ధరించడంతోపాటు నిర్ణీత దూరం పాటించాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ఇలా ఉండగా, ముంబైలో పాక్షికంగా లాక్డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయని గార్డియన్ మినిస్టర్ అస్లాం షేక్ పేర్కొనడం బట్టి.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టపడని పక్షంలో లాక్డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.