ఇది కదా ఐపీఎల్ మజా అంటే.. చివరి ఓవర్లో 19 పరుగులు.. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం.. అలాంటి సమయంలో రాహుల్ తెవాటియా (3 బంతుల్లో 13) వరుసగా సిక్సర్లు బాది గుజరాత్ను గెలిపించాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్కు థ్రిల్లింగ్ విక్టరీ దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన పంజాబ్ జట్టు లియామ్ లివింగ్స్టన్ (64), జితేష్ శర్మ (23), ధవన్ (35), రాహుల్ చాహర్ (22 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలో దిగిన గుజరాత్ను శుభ్మన్ గిల్ (96) విజయానికి చేరువ చేశాడు. సెంచరీ చేసేలా కనిపించిన అతను 19వ ఓవర్లో అవుటయ్యాడు. ఆ తర్వాత 20వ ఓవర్ తొలి బంతికే హార్దిక్ పాండ్యా రనౌట్ అయ్యాడు. ఆ ఓవర్లో గుజరాత్ గెలవాలంటే ఇంకా 19 పరుగులు కావలసి ఉంది. ఇలాంటి సమయంలో మిల్లర్ ఫోర్ కొట్టగా.. ఆ తర్వాతి బంతికి బౌలర్ ఒడియన్ స్మిత్ అనవసర తప్పిదంతో సింగిల్ వచ్చింది. దీంతో గుజరాత్ గెలవాలంటే చివరి రెండు బంతులకు 12 పరుగులు అవసరమయ్యాయి.
ఇలాంటి సమయంలో బ్యాటింగ్ చేసిన తెవాటియా.. చివరి రెండు బంతులకు రెండు భారీ సిక్సర్లు బాది జట్టుకు విజయాన్నందించాడు. అభిమానులకు టీ20 క్రికెట్లోని థ్రిల్ చూపించాడు. దీంతో గుజరాత్ జట్టు ఆరు వికెట్ల తేడాతో పంజాబ్పై విజయం సాధించింది. పంజాబ్ బౌలర్లలో రబాడ 2, చాహర్ 1 వికెట్ తీసుకున్నారు. గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించడం గమనార్హం.