పాలు, పాల ఉత్పత్తులపైనా ఇటీవల కేంద్ర ప్రభుత్వం పన్నులు విధించింది. ఇంతవరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5-12 శాతం జీఎస్టీ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో వినియోగించే యంత్రాలపై 12 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీని పెంచారు.
ఈ నిర్ణయాలతో దేశంలో కోట్ల కుటుంబాలు ఆదనపు భారం మోయాల్సి ఉంటుంది. పాల ఉత్పత్తి రంగంలో 30 కోట్ల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కేంద్రం నిర్ణయం స్వదేశీ పాల ఉత్పత్తిపై భారం మోపి విదేశాల నుంచి పాల దిగుమతులకు ఆవకాశాలు కల్పించే విధంగా ఉన్నది.
2020-21 గణాంకాలు పరిశీలిస్తే 20.10 కోట్ల టన్నుల పాల ఉత్పత్తితో భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఏటా 6.2 శాతం వృద్ధితో ఈ రంగం అభివృద్ధి చెందుతున్నది. అమెరికా 10 కోట్ల టన్నులు, పాకిస్థాన్ 5.5 కోట్ల టన్నులు, బ్రెజిల్ 4.5 కోట్ల టన్నులు, 28 యూరోపియన్ దేశాలు 16.72 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరుపుతున్నాయి. ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశం పాల ఉత్పత్తిని దెబ్బతీయడానికి అగ్రరాజ్యాలు కుట్రలు పన్నుతున్నాయి. దీంట్లోభాగంగానే జీఎస్టీ పెరిగిందా అన్న అనుమానాలున్నాయి. పాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, అమెరికా దేశాల నుంచి పాలు, పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆవు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండగా, మన దగ్గర గేదె పాల ఉత్పత్తి అధికం. వెన్న, ఐస్క్రీమ్, పాలపొడి, చీజ్ తదితర ఉత్పత్తుల దిగుమతుల కోసం ఏటా దాదాపు రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మన పాలతో మనమే ఈ ఉత్పత్తులను తయారు చేసినట్లయితే ఇంతటి భారీ నిధులను ఆదా చేయవచ్చు. నేటికీ దేశంలో తలసరి పాల వాడకం రోజుకు 420 గ్రాములను మించటం లేదు. దీనిని పెంచాల్సి ఉంది.
ఇటీవల జరిగిన డబ్ల్యూటీఓ సమావేశాల్లో ఎగుమతి సబ్సిడీలు ఇవ్వరాదని నిర్ణయించారు. అయితే, ధనిక దేశాలు ఏదో పేరుతో (గ్రీన్బాక్స్, బ్లూబాక్స్, అంబర్బాక్స్ పేరిట) రాయితీలు కొనసాగిస్తున్నాయి. ఆంక్షలు అమలు చేసే బాధ్యత అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల మీదనే పెడుతున్నాయి. జీ-7 దేశాల సమావేశంలో కూడా ఇదే ధోరణిని సంపన్న దేశాలు ప్రదర్శించాయి. వీటి పర్యవసానంగానే 47వ జీఎస్టీ సమావేశంలో అన్ని ఉత్పత్తులపై ఇబ్బడి ముబ్బడిగా పన్నులు పెంచేశారు. ఈ విధంగా చేయటానికే ‘ఒకే దేశం-ఒకే పన్ను’ అనే విధానాన్ని తీసుకొచ్చారు.
ఇప్పటికే దేశంలో ఐదేండ్లలోపు పిల్లలు పౌష్టికాహారలోపంతో వెయ్యి మందికి 40 మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50 శాతం మంది మహిళలు, యువతీ యువకులు రక్తహీనతతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పౌష్టికాహారాన్ని మరింత దూరం చేస్తున్నారు కేంద్ర పాలకులు. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి దేశంలోని పౌరులకు పాలు అందించలేకపోవడం సిగ్గుచేటు. ఓవైపు, పన్నుల పెంపు ద్వారా వచ్చిన ఆదాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు, అపర కుబేరులకు కట్టబెట్టే మోదీ ప్రభుత్వం మరోవైపు కోట్లాది మంది నిరుపేద, పేద భారతీయులపై ఈ విధంగా భారం మోపటం శోచనీయం. దీనిని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించాలి. పాలతోసహా నిత్యావసర సరుకులపై ఎలాంటి జీఎస్టీ ఉండవద్దు. 14 రకాల నిత్యావసర సరకులను ప్రజలకు ప్రభుత్వం రాయితీలతో సరఫరా చేయాలి. ఈ డిమాండ్ల సాధన కోసం ప్రజానీకం ఉద్యమించాలి.
– మూడ్ శోభన్, 99497 25951
రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం