న్యూఢిల్లీ, ఆగస్టు 12: నివాస గృహాలను వ్యక్తిగత, కుటుంబ వినియోగానికి అద్దెకు తీసుకుంటే జీఎస్టీ వర్తించబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. గృహ అద్దెలపై 18 శాతం జీఎస్టీ ఉన్నదంటూ వెలువడిన మీడియా వార్తలపై స్పందిస్తూ ప్రభుత్వం శుక్రవారం ట్వీట్ చేస్తూ నివాస గృహాన్ని వ్యాపార సంస్థకు కిరాయికి ఇస్తేనే జీఎస్టీ విధింపు ఉంటుందని స్పష్టం చేసింది.
ఒక సంస్థ యాజమాని, లేదా వ్యాపార భాగస్వామి అయినా సరే వ్యక్తిగత అవసరాలకు అద్దెకు తీసుకుంటే జీఎస్టీ వర్తించబోదని పేర్కొంది. జీఎస్టీ కింద రిజిష్టరైన సంస్థ లేదా వ్యక్తి వ్యాపార అవసరాలకు నివాస గృహాన్ని అద్దెకు తీసుకుంటే 18 శాతం జీఎస్టీని విధించాలని ఇటీవల కౌన్సిల్ నిర్ణయించింది.