న్యూఢిల్లీ, అక్టోబర్ 1: జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. గడిచిన ఏడు నెలలుగా రూ.1.40 లక్షల కోట్లకుపైగా వసూలైన జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలకుగాను రూ.1.47 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన దాంతో పోలిస్తే 26 శాతం అధికమని పేర్కొంది. అన్ని ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం, ఎగవేతలకు చెక్ పెట్టడం వల్లనే గడిచిన ఏడు నెలలుగా పన్ను వసూళ్లు పెరిగాయని పేర్కొంది. గత నెలకు వసూలైన రూ.1,47,686 కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.25,271 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.31,813 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,464 కోట్లు, సెస్ రూపంలో రూ.10,137 కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్లో రికార్డు స్థాయి రూ.1.67 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైన విషయం తెలిసిందే. అలాగే ఆగస్టు నెలలో రూ.1.43 లక్షల కోట్లుగా ఉన్నది. గత నెలలో 1.1 కోట్ల ఈ-వే బిల్లులు, ఈ-ఇన్వాయిస్లు జారీ అయ్యాయి.
తెలంగాణలో 3,915 కోట్లు
గత నెలకుగాను తెలంగాణ రాష్ట్రంలో రూ.3,915 కోట్ల మేర జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే నెలలో వసూలైన రూ.3,494 కోట్లతో పోలిస్తే 12 శాతం అధికమని పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లు రూ.2,595 కోట్ల నుంచి రూ.3,132 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ప్రస్తుత పండుగ సీజన్తో వచ్చే నెలల్లో పన్ను వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉన్నదని విశ్లేషకులు వెల్లడించారు.