5-8 నిమిషాల్లోనే దరఖాస్తు సమర్పణ
వెబ్సైట్పై భారం పడకుండా చర్యలు
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -1 దరఖాస్తు ప్రక్రియ శరవేగంగా జరిగేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతున్నది. వెబ్సైట్పై లోడ్ పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నది. దీనికోసం ఒక టీం ప్రతి రోజూ పనిచేస్తున్నది. అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా ప్రతి రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల వరకు పనులు చేస్తున్నది. ఫలితంగా గ్రూప్-1 దరఖాస్తు ప్రక్రియ 5 నుంచి 8 నిమిషాల్లోనే పూర్తవుతున్నది. ఏమైనా సమస్య తలెత్తినట్టు దృష్టికి రాగానే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నది.
గ్రూప్-1కు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు కాల్ చేసి, దరఖాస్తు సమయంలో తలెత్తిన ఇబ్బందులపై వాకబు చేస్తున్నది. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని తొలుత చెప్పినప్పటికీ.. ఆ తర్వాత అభ్యర్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయాన్ని టీఎస్పీఎస్సీ వెనక్కి తీసుకొన్నది. వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో ఒరిజినల్స్ చూపించాలని పేర్కొన్న విషయం తెలిసిందే.
50 వేలు దాటిన దరఖాస్తులు
గ్రూప్-1 కు ఆదివారం సాయంత్రం వరకు 50,986 మంది దరఖాస్తు చేసుకొన్నారు. కొత్తగా 89,332 మంది ఓటీఆర్ (వన్ టైం రిజిస్ట్రేషన్) నమోదు చేసుకోగా, 1,90,362 మంది ఓటీఆర్ను ఎడిట్ చేసుకొన్నారు.