సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. మొత్తం 144 మంది జంటలకు మంత్రి ఆధ్వర్యంలో పెళ్లిళ్లు చేయడానికి అంతా సిద్ధమైంది. అలాంటి సమయంలో ఒక వరుడు.. మంచినీళ్లు తాగి వస్తానని చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఎంతసేపటికీ అతను తిరిగి రాలేదు. దాంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు.
అయినా అతని జాడ తెలియలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగు చూసింది. ఆ రాష్ట్ర మంత్రి ధరమ్ పాల్ సింగ్ ఆధ్వర్యంలో 144 మంది జంటలకు సామూహిక వివాహాలు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఒక వరుడు మంచినీళ్లు తాగొస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఎంత గాలించినా అతను దొరకలేదు. దీంతో వధువు తల్లిని ఆరా తీయగా..
కట్నం కింద మోటార్ బైక్ కావాలని కాబోయే అల్లుడు అడిగాడని, కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇవ్వలేకపోయామని చెప్పింది. దీంతో కోపం తెచ్చుకున్న వరుడు.. ఇలా మండపం నుంచి పారిపోయాడని ఆరోపించింది. ఇదంతా అతను పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడని తల్లీకూతుళ్లు వాదిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.