హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): జిత్తులమారి చంద్రబాబు కన్ను మళ్లీ తెలంగాణపై పడింది. స్వరాష్ట్రంలో, స్వయంపాలనలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణపై విషం చిమ్మేందుకు కాచుక్కూచున్న బాబు మునుగోడు ఉప ఎన్నికను అడ్డం పెట్టుకొని అడుగుపెట్టాలని చూస్తున్నారని ఇటీవలి పరిణామాలు అనుమానం కలిగిస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికలతో భూస్థాపితమైపోయిన పార్టీ ఉనికిని నిలబెట్టుకోవడానికి కూటనీతిని ప్రదర్శిస్తున్నారు. ఇందుకు తార్కాణాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ప్రచారంలో టీడీపీ జండాలు పెద్ద ఎత్తున రెపరెపలాడటంతో బాబు పన్నాగం విస్పష్టమైందని విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే తన కోవర్ట్ రేవంత్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చొప్పించి.. ఆ పార్టీ పీక నులిమే పనిని విజయంతంగా చేస్తున్న బాబు.. బీజేపీతో మళ్లీ అంటకాగడం ద్వారా తెలంగాణతో పాటు.. ఆంధ్రప్రదేశ్లోనూ కొడిగడుతున్న టీడీపీ దీపాన్ని కాపాడుకోవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారని భావిస్తున్నారు. ఇందుకు వారు చూపుతున్న కారణాలివి..
రాజగోపాల్కు దన్నుగా నిలవండి..
తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని చెడగొట్టి.. తిరిగి ఉనికి తెచ్చుకోవడం కోసం బీజేపీతో చంద్రబాబు అంటకాగినట్టు మునుగోడు రోడ్షోతో తేలిపోయింది. రాజగోపాల్రెడ్డికి అండగా ఉండాలని చంద్రబాబు స్థానిక టీడీపీ శ్రేణులకు సూచించినట్టు సమాచారం. ‘మనవాళ్లు కొంతమంది వస్తారు.. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ థింగ్. మునుగోడులో మనం చేసే పనితో మనవాళ్లల్లో కసి మరోసారి బయటికి వస్తుంది.. జాగ్రత్తగా చేసుకోండి’ అని ’ అని చంద్రబాబు టీడీపీ ముఖ్యనాయకులకు చెప్పినట్టు తెలిసింది. చంద్రబాబు సూచనల మేరకే గట్టుప్పల్లో ఎగిరిన టీడీపీ జండాలు ఎగిరాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
గరికపాటి రాయబారం!
రాజగోపాల్రెడ్డి కోసం పనిచేయడానికి విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి టీడీపీ నేతలను, కార్యకర్తలను మునుగోడుకు పంపించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి.. బీజేపీలో చేరిన నేతల ద్వారా రాజగోపాల్రెడ్డి చంద్రబాబుతో రాయబారం నెరపినట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న గరికపాటి మోహన్రావు ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. పది రోజుల క్రితం రాజగోపాల్రెడ్డి వ్యాపార సన్నిహితుడు ఒకరు గరికపాటితో కలిసి చంద్రబాబుతో భేటీ అయి చర్చలు జరిపినట్టు తెలిసింది. ఆ భేటీ తరువాతే.. టీడీపీ శ్రేణులు రాజగోపాల్రెడ్డి ప్రచారంలో భాగస్వాములయ్యాయని అంటున్నారు. నిజానికి మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేనాటికి ముందే టీడీపీ ఎన్నికల బరిలో నిలుస్తుందని, అందుకు సిద్ధంగా ఉండాలని స్థానిక నాయకులకు సమాచారం అందింది. అందులో భాగంగానే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి అంజయ్య యాదవ్ పేరు తెరపైకి వచ్చింది. టీడీపీ మద్దతు తనకు కలిసి వస్తుందని భావించిన రాజగోపాల్రెడ్డి.. ఆ పార్టీ పోటీలో ఉండకుండా చేసిన ప్రయత్నం ఫలించింది. చంద్రబాబు పేరు చెప్తే నష్టం వాటిల్లవచ్చని బీజేపీలో ఒక వర్గం హెచ్చరించినా.. రాజగోపాల్ వినిపించుకోలేదని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
కోవర్టు రాజకీయం
చంద్రబాబు అనుంగు అనుచరుడు రేవంత్రెడ్డిని కాంగ్రెస్లో కోవర్ట్గా చేర్పించినప్పటినుంచి ఆ పార్టీ పూర్తిగా తన అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొన్నది. చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ పనిచేస్తారన్నది బహిరంగ రహస్యమే. బహిరంగ కార్యక్రమాల్లో చంద్రబాబును రేవంత్ ప్రత్యక్షంగానే కీర్తిస్తుంటారు. కాంగ్రెస్లోకి టీడీపీ మాజీ నేతలను చొప్పించడం.. సీనియర్లను బలహీనం చేయడం ద్వారా పార్టీ పీక నులిమే పనిని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సరైన ఏర్పాట్లు చేయలేదని కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో బలహీన అభ్యర్థిని బరిలోకి దింపి.. బలంగా ఉన్న పార్టీని దెబ్బతీశారని పార్టీలోని సీనియర్ నేతలే తీవ్రంగా విమర్శించిన విషయం బహిరంగమే. ఇప్పుడు మునుగోడులోనూ బలహీన అభ్యర్థిని దింపారని సీనియర్లు రేవంత్ పట్ల గుర్రుగా ఉన్నారు. ఎన్నికల ప్రచార సభల్లోనూ రేవంత్ తీరు కాంగ్రెస్ గెలుపును ఆకాంక్షిస్తున్నట్టు లేదని విమర్శిస్తున్నారు. పైపెచ్చు మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై పనిచేస్తున్నాయని తాజాగా రేవంత్ విమర్శలు గుప్పించడం ఆయన ద్వంద్వవైఖరిని బయట పెడుతున్నాయంటున్నారు.
బీజేపీతో పొత్తుకు చంద్రబాబు తహతహ
తెలంగాణలో సొంతంగా టీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తిలేదు కాబట్టి తాను బీజేపీతో పొత్తుపెట్టుకోవటం ద్వారా తన కలలు పండించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని విశ్లేషకుల అభిప్రాయం. ఉన్నపళంగా టీడీపీకి పూర్వవైభవం రాకపోయినా.. బీజేపీతో పొత్తు కొంతమేరకు తనకు ప్రయోజనం కలిగించవచ్చన్న వ్యూహంతోనే చంద్రబాబు అడుగులు వేస్తునారని చెప్తున్నారు. ఇందులో భాగంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, పార్టీ కార్యాలయంలో దిగుమతి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఉనికి చాటుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఉదహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ను పార్టీలో చేర్చుకొన్న సందర్భంగా కొందరు నేతలతో బాబు తన ఆలోచనలు పంచుకొన్నారని సమాచారం. ‘అక్కడ (ఆంధ్రప్రదేశ్లో) ఒంటరిగా వైసీపీని ఎదుర్కోలేము..అలాగే ఇక్కడ టీఆర్ఎస్ బలాన్ని నిలువరించలేం. అందుకు పెద్దపార్టీతో చర్చలు సాగుతున్నాయి.
మళ్లీ మనకు మంచిరోజులు రాబోతున్నాయి. ఇప్పుడు మునుగోడులో పోటీచేద్దాం అనే సంకేతాలు ఇద్దాం. మన ప్రయత్నాలు ఫలిస్తే వాళ్లు (బీజేపీ వాళ్లు) మన దగ్గరకు వస్తారు. ఏం చేయాలో అప్పుడు నిర్ణ యం తీసుకుందాం’ అని చంద్రబాబు తన ఉద్దేశాన్ని చెప్పినట్టు తెలుస్తున్నది. అనుకొన్నట్టుగానే రాజగోపాల్ నుంచి రాయబారం రావడం.. ఆయనకు మద్దతుగా అభ్యర్థిని పెట్టడం లేదని చెప్పడం.. ప్రచారంలో పచ్చ జెండాలు ఎగరడం జరిగిపోయాయి.