మెదక్ భైంసా మధ్య 168 కిలోమీటర్లు
మెదక్- ఎల్కతుర్తి మధ్య 133 కిలోమీటర్లు
కేంద్రం గెజిట్ విడుదల
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు జాతీయ రహదారులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు గురువారం గెజిట్ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 3910 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయ రహదారులు ఇకపై 4211 కిలోమీటర్లకు పెరుగనున్నాయి. రాష్ట్రంలో జాతీయ రహదారుల పెంపు కోసం తెలంగాణ ఎంపీలు చేసిన కృషి ఫలించింది. మెదక్ నుంచి ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాసర, బోధన్, భైంసా వరకు 168 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారిని నిర్మించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ రహదారి హైదరాబాద్ ఔటర్ రింగ్రోడ్డుకు కలవడంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల, తాడి హిప్పెర్గ, లింబూర్, సిర్పూర్, పొథంగల్, కోటగిరి, రుద్రూరు రోడ్లకు అనుసంధానమవుతుంది. అలాగే మెదక్ నుంచి రామాయంపేట, సిద్దిపేట, హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి జంక్షన్ వరకు 133 కిలోమీటర్ల పొడవుతో మరో జాతీయ రహదారిని కేంద్రం ఆమోదించింది. ఈ జాతీయ రహదారితో వరంగల్ నుంచి మెదక్ వెళ్లే వాహనాలకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ రెండు రహదారులు తెలంగాణలోని అనేక ప్రాంతాల మీదుగా వెళతాయి. ఈ రహదారులను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రానికి వినతులు సమర్పించింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వయంగా ప్రధానికి విజ్ఞప్తిచేశారు. రోడ్లు భవనాలశాఖ మంత్రి, తెలంగాణ ఎంపీలు కూడా పలు సందర్భాల్లో కేంద్ర మంత్రిని, శాఖ కార్యదర్శిని కలిసి విజ్ఞప్తిచేశారు. ఎట్టకేలకు ఈ రెండు జాతీయ రహదారులను కేంద్రం ఆమోదించింది.