బరిలోకి దిగిన తొలి చెస్ ఒలింపియాడ్లోనే వ్యక్తిగత విభాగంలో రజతం పట్టిన తెలంగాణ కుర్రాడు.. మొదటిసారి స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో అపజయమన్నదే ఎరుగకుండా సత్తాచాటాడు. తోటి ఆటగాళ్ల కంటే ఒక మెట్టుపైనే ఉన్న ఈ ఓరుగల్లు చిన్నోడు.. ఇటీవలే 2700 ఎలో రేటింగ్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. కెరీర్ తొలినాళ్లలోనే చెస్ ఒలింపియాడ్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో పాల్గొనడం ఉత్సాహాన్నిచ్చిందంటున్న తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరగైసి.. ఎప్పటికైనా ప్రపంచ చాంపియన్ కావడమే తన లక్ష్యమంటున్నాడు. రేటింగ్ పెంచుకోవడంపైనే దృష్టిపెట్టానంటున్న అర్జున్ కెరీర్పై ప్రత్యేక కథనం..
ఇటీవల మహాబలిపురం వేదికగా ముగిసిన 44వ చెస్ ఒలింపియాడ్లో బరిలోకి దిగిన తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరగైసి.. వ్యక్తిగత విభాగంలో రజతం పతకం కైవసం చేసుకున్నాడు. టీమ్ విభాగంలో భారత్-‘ఎ’కు ప్రాతినిధ్యం వహించిన అర్జున్.. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచాడు. మొత్తం 11 రౌండ్లలో ఆరింట విజయాలు సాధించిన ఈ వరంగల్ చిన్నోడు.. మిగిలిన ఐదు మ్యాచ్లను ‘డ్రా’గా ముగించాడు.
ఓవరాల్గా 8.5 పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలిసారి స్వదేశంలో జరిగిన మెగాటోర్నీలో భారీ అంచనాల మధ్య రెండో సీడ్గా బరిలోకి దిగిన భారత-‘ఎ’జట్టు.. పతకం చేజిక్కించుకోలేకపోయినా.. అర్జున్ వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మెగాటోర్నీలో భాగంగానే 2700 ఎలో రేటింగ్ సాధించిన అర్జున్.. భవిష్యత్తులో వరుస విజయాలు సాధించడమే తన లక్ష్యమంటున్నాడు.
గ్రాండ్మాస్టర్ హోదా దక్కించుకొని ఎక్కువ రోజులు కాకముందే.. చెస్ ఒలింపియాడ్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో పాల్గొనే అవకాశం రావడం సంతోషాన్నిచ్చిందన్న అర్జున్.. ఓపెన్ విభాగంలో అగ్రశ్రేణి జట్టుతో కలిసి ఆడటం మంచి అనుభవమని పేర్కొన్నాడు. జట్టులో ఉన్న హరికృష్ణ, విదిత్ సంతోష్, నారాయణన్, శశికిరణ్.. అందరూ 2600 ఎలో రేటింగ్ దాటిన గ్రాండ్మాస్టర్లే కావడంతో స్వతహాగా తమపై భారీ అంచనాలు పెరిగాయని.. టోర్నీ ఆరంభంలో తమ ప్రదర్శన అందుకు తగ్గట్టే సాగిందని అర్జున్ చెప్పాడు.
ఏడో రౌండ్ వరకు అజేయంగా సాగిన భారత్-‘ఎ’టీమ్.. ఎనిమిదో రౌండ్లో అర్మేనియా చేతిలో ఓటమి పాలైంది. దీంతో పాయింట్లలో వెనుకబడి పతకం కోల్పోవాల్సి వచ్చింది. అంతకుముందు ఆరో రౌండ్లో ఉజ్బేకిస్థాన్తో గెలువాల్సిన మ్యాచ్ను ‘డ్రా’గా ముగించడం కూడా పతక అవకాశాలను దెబ్బతీసిందని అర్జున్ పేర్కొన్నాడు. ఏదేమైనా వ్యక్తిగత ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నానని చెప్పాడు.
ఎత్తుకు పై ఎత్తు వేయడాన్ని చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడే ఈ 18 ఏండ్ల కుర్రాడు.. అంతర్జాతీయ టోర్నీల్లో రాణించడం ద్వారా జీఎం నార్మ్లు సాధించగలిగాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ల శిక్షణతో మరింత రాటుదేలిన అర్జున్.. తాజా టోర్నీలోనే 2700 రేటింగ్ పాయింట్ మార్క్ దాటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏడో భారత గ్రాండ్మాస్టర్గా చరిత్రకెక్కాడు.
టోర్నీల వల్ల చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టలేకపోయినా.. వీలు చిక్కినప్పుడల్లా పుస్తకాలు చదువుతాని అర్జున్ పేర్కొన్నాడు. చెస్ ఒలింపియాడ్ సమయంలో ఒత్తిడి దరి చేరనివ్వకుండా ఉండేందుకు జట్టు సభ్యులతో కలిసి టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్ ఆడేవాళ్లమన్న అర్జున్.. మెగాటోర్నీలో హరికృష్ణ తనకు సూచనలిచ్చాడన్నాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ భారత జట్లకు మెంటార్గా ఉండటం బాగా కలిసొచ్చిందని పేర్కొన్నాడు.
కెరీర్ ఆరంభం నుంచి గెలువాలన్న కసే నన్ను నడిపిస్తున్నది. ప్రతి గేమ్లో విజేతగా నిలువాలనే పట్టుదలతో పోరాడుతా. చెస్ ఒలింపియాడ్ అనుభవం మరిచిపోలేనిది. జట్టు విభాగంలో పతకం దక్కక పోయినా.. వ్యక్తిగత విభాగంలో రజతం నెగ్గడం ఆనందాన్నిచ్చింది. 2700 ఎలో రేటింగ్ మార్క్ దాటడంతో సంతృప్తిపడను. ఇప్పుడు 2750పై దృష్టి పెట్టా. అందుకోసం ఈ నెల 18న అబుదాబి వెళ్తున్నా. ఆక్కడ రెండు ప్రధాన టోర్నీల్లో పాల్గొనాల్సి ఉంది. ఎప్పటికైన ప్రపంచ చాంపియన్గా నిలువాలన్నదే నా లక్ష్యం.
-అర్జున్ ఇరగైసి
గత కొన్నేండ్లుగా అర్జున్ నిలకడగా రాణిస్తున్నాడు. చెస్ ఒలింపియాడ్లో రజతంతో సత్తాచాటాడు. ప్రస్తుతం అబుదాబి టోర్నీ కోసం సిద్ధమవుతున్నాడు. 2750 ఎలో రేటింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం లభిస్తే.. భవిష్యత్తులో అర్జున్ అద్భుతాలు చేయగలడు. అర్జున్ను స్ఫూర్తిగా తీసుకొని పిల్లలు చెస్ వైపు అడుగులు వేస్తే సంతోషిస్తా.
-జ్యోతి, అర్జున్ తల్లి