న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు భారీ కసరత్తు జరుగుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ ఊపందుకున్నది. బీహార్లో మహా కూటమికి చెందిన ఇద్దరు అగ్ర నేతలైన ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ అదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ కాబోతున్నారన్న వార్త ఈ చర్చకు బలం చేకూరుస్తున్నది.
నితీశ్కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరూ సోనియాగాంధీతో సమావేశం కానుండటం దాదాపు గత ఏడేండ్లలో ఇదే తొలిసారి. ఈ కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కూడా హాజరవుతారని లాలూ, నితీశ్ భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రాహుల్గాంధీ ప్రస్తుతం.. కన్యాకుమారి టు కశ్మీర్ భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో ఉన్నారు.
ఇదిలావుంటే లాలూప్రసాద్ యాదవ్, నితీశ్కుమార్ కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే సోనియాతో భేటీ కాబోతున్నారని, ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నదని, అందులో జాతీయస్థాయిలో మహా కూటమిని ఏర్పాటు చేయాలనే అంశం కూడా ఉంటుండవచ్చునని మరో వాదన వినపడుతున్నది.