పట్నా : మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో నిబంధనలకు విరుద్ధంగా మందు పార్టీలో పాల్గొన్న 19 మంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన రోహ్తాస్ జిల్లాలో వెలుగుచూసింది. విధానమండలి సీట్ను ఆశిస్తున్న అభ్యర్ధి ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన లిక్కర్ పార్టీకి పలువురు గ్రామ సర్పంచ్లు, ఓ సహకార వ్యవసాయ పరపతి సంఘం చీఫ్ సహా 19 మంది హాజరయ్యారు.
నిందితుడు తన నివాస గృహంలోనే పార్టీ ఏర్పాటు చేశాడని పోలీసులు తెలిపారు. లిక్కర్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో ఎస్పీ ఆశీష్ భారతి, దరిగావ్ పోలీస్ అధికారి ధర్మేంద్ర కుమార్ సారథ్యంలో పోలీసుల బృందం పార్టీ నిర్వాహకుడి ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో 125 లీటర్ల మద్యం, రెండు లైసెన్స్డ్ తుపాకులు, ఇతర ఆయుధాలను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.