బీర్కూర్, ఏప్రిల్ 15: ‘రెండు జాతీయ పార్టీలకు చెందిన ఇద్దరు తోపు ఎంపీలు.. తెలంగాణ రైతుల గురించి ఒక్కనాడైనా పార్లమెంటులో మాట్లాడారా..? తెలంగాణ గోసను ఎన్నడైనా వినిపించారా? ధాన్యం కొనబోమన్న కేంద్ర సర్కారును ఏనాడైనా నిలదీశారా?’ అని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రశ్నించారు. వరి వేయండి.. కొంటామని చెప్పినవారు తీరా కొనే సమయానికి ఎటు పారిపోయారని నిలదీశారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లో పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పోచారం శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరూ బయట మైకు దొరికితే చాలు అన్నీ నరుకుడు (కోతల) మాటలే. మరి ఎంపీలై ఉండి, పార్లమెంటులో వాళ్లు నోరెందుకు విప్పలేదు. ఉప్పుడు బియ్యం కొనబోమని కేంద్రం చెప్పినప్పుడు వాళ్లెందుకు కిమ్మనలేదు? వడ్లు కొనాల్సిందేనని ఢిల్లీలో ఎం దుకు నిలదీయలేదు?’ అని ప్రశ్నించారు. తాను స్పీకర్గా ప్రతిపక్షాలను విమర్శించడం లేదని, కడుపు మండిన రైతుగా ప్రశ్నిస్తున్నానని అన్నారు.
రెండు జాతీయ పార్టీలు పాలిస్తున్న ఏ రాష్ట్రంలో నూ తెలంగాణ సంక్షేమ పథకాల్లాంటివి కనిపించవని, అలాంటప్పుడు ఈ తోపు ఎంపీలకు తెలంగాణలో ఏం తక్కువైందని పాదయాత్రలు చేస్తున్నారని స్పీకర్ పోచారం నిలదీశారు. తాను ఇటీవల అస్సాంలోని గువాహటికి వెళ్తే.. ఆ నగర పరిస్థితి దయనీయంగా ఉన్నదని చెప్పారు. అక్కడ అభివృద్ధే లేదని, రోడ్లు మరీ అధ్వానంగా ఉన్నాయని స్పీకర్ పేర్కొన్నారు. రాష్ర్టాలన్నింటికీ కేంద్రమే పెద్దన్నలాంటిదని, ఆహార భద్రత బాధ్యత దానిదేనని పేర్కొన్న పోచారం.. తెలంగాణపై మాత్రం సవతి తల్లి ప్రేమను చూపుతున్నదని విమర్శించారు. కేంద్రం నిర్లక్ష్యంతో రైతాంగం నష్టపోవద్దన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.