కుమార్తె బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తున్నాడతను. అసలే రాత్రి, దానికితోడు భారీగా వర్షం పడుతోంది. అందుకని జీపీఎస్ ఆన్ చేసి దానిలో దారి చూసుకుంటూ వెళ్తున్నాడు. అలా గుడ్డిగా టెక్నాలజీని నమ్మడమే అతని ప్రాణాలు తీసింది. జీపీఎస్లో అక్కడ లేని బ్రిడ్జి ఉందని నమ్మిన అతను.. జీపుతో సహా నదిలో పడి మరణించాడు.
ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో వెలుగు చూసింది. హికరీలో నివశించే ఫిల్ పాక్సన్ (47) అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. వారిలో ఒకరి బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం రాత్రి పూట ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆ కుటుంబం.. కనీసం ఒక్క సైన్ బోర్డు ఉన్నా కూడా ఫిల్ ప్రాణాలతో ఉండేవాడని అంటున్నారు.
కొన్నేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆ బ్రిడ్జి సగం కొట్టుకుపోయింది. ఆ తర్వాత దాన్ని ప్రభుత్వం బాగు చేయలేదు. ఇదేంటని అడగ్గా.. సదరు బ్రిడ్జి తమ పరిధిలోకి రాదని నార్త్ కరోలినా అధికారులు చెప్పారు. తమకూ దానితో సంబంధం లేదని, అది ప్రైవేటు ప్రాపర్టీ అని హికరీ సిటీ అధికారులు అంటున్నారు.