జగిత్యాల, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఉత్తమ విద్యను అందిస్తున్నది. 1998లో ప్రారంభమైన ఈ కాలేజీ దినాదినాభివృద్ధి చెందుతూ ఎంతోమందికి ఉన్నత చదువులు అందించింది. వేలాది మంది విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్నది. సువిశాల స్థలంలో ఏర్పాటైన కాలేజీలో సకల సౌకర్యాలతో పాటు దూరప్రాంత విద్యార్థుల కోసం ఆవరణలోనే హాస్టల్ వసతి ఉన్నది. మ్యాథ్స్, కంప్యూటర్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ సబ్జెక్ట్ల కోసం ప్రత్యేక ల్యాబ్లున్నాయి. క్రీడా ప్రాంగణం, మహిళా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జిమ్, ఆడిటోరియం ఏర్పాటయ్యాయి. వీటితోపాటు దూర ప్రాంత విద్యార్థుల కోసం 200మంది సామర్థ్యంతో హాస్టల్ సౌకర్యం కల్పించారు. అందులో 175సీట్లు డిగ్రీకాలేజీ విద్యార్థులకు, 25 సీట్లను ఇంటర్మీడియెట్ విద్యార్థులకు కేటాయించారు.
అందిస్తున్న కోర్సులివే..
కాలేజీలో ప్రస్తుతం బీఎస్సీ (లైఫ్ సైన్సెస్ 120 సీట్లు), బీఎస్సీ (ఫిజికల్ సైన్స్ 60 సీట్లు), బీఏ(సీబీసీఎస్ 60 సీట్లు), బీఏ సీబీసీఎస్ (తెలుగు మీడియం 60 సీట్లు), బీఏ సీబీసీఎస్ (ఉర్దూ మీడియం 60 సీట్లు), బీకాం (కంప్యూటర్ అప్లికేషన్స్ 60 సీట్లు) మొత్తంగా 360 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, మరిన్ని అదనపు సీట్ల మంజూరు కోసం ప్రభుత్వానికి విన్నవించారు. ఇప్పటికే కాలేజీలో ఎంకాంలో పీజీ కోర్సు ఉండగా, ఈ యేడాది ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎమ్మెస్సీ బోటనీ, ఎమ్మెస్సీ జువాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సుల మంజూరుకు కాలేజీ బోధనా బృందం ప్రయత్నం చేస్తున్నది.
పలు సంస్థలతో ఎంవోయూ
విద్యార్థులకు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు పలు సంస్థలతో కాలేజీ ఎంవోయూను కుదర్చుకున్నది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐఐటీ బాంబే స్పోకెన్ ట్యుటోరియల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నది. ఈ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ (జాబ్ ఓరియంటేషన్)తోపాటు సాఫ్ట్వేర్ రంగంలో జాబ్స్ సాధనకు శిక్షణ ఇస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్తోనూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బ్యాంకు ఆధ్వర్యంలో విద్యార్థులకు సాఫ్ట్వేర్తోపాటు బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాల సాధనకు శిక్షణ ఇప్పించనున్నారు. ప్రఖ్యాతి గాంచిన ట్యాలీ సంస్థతోనూ ఒప్పందం చేసుకొని, బీకాం విద్యార్థులకు అకౌంట్స్ విభాగంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐఐటీ హైదరాబాద్ సంస్థతోనూ శిక్షణ ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇక జాతీయ స్థాయిలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన ‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా దక్కన్ రీజియన్ హైదరాబాద్’తో ఒప్పందం చేసుకున్నారు. బొటానికల్ ప్రాజెక్టులు, స్కిల్ ట్రెయినింగ్తో పాటు ఫోరా ఐడెంటిఫికేషన్ (నూతన మొక్కల జాతుల గుర్తింపు)లో ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. వీటితో పాటు కాలేజీకి కరీంనగర్ తర్వాత పరిశోధనా కేంద్రాన్ని మంజూరు చేస్తూ ఉన్నత విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రీసెర్చ్ కేంద్రం మంజూరుతో ఇక్కడి విద్యార్థులు, ఇక్కడే పరిశోధనలు చేసేందుకు అవకాశాలు మెరుగయ్యాయి.
మా కాలేజీ బాగున్నది
మా కాలేజీ చాలా బాగున్నది. మా లెక్చరర్లందరు చక్కగా బోధిస్తున్నారు. పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణం ఉన్నది. కాలేజీలో సకల సౌకర్యాలున్నాయి. జిమ్తో పాటు, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లిష్ ల్యాబ్లు ఉన్నాయి. వర్చువల్ పద్ధతిలో ఇతర విద్యా సంస్థలతో సైతం విద్యార్థులకు ఇంట్రాక్ట్ కల్పిస్తున్నారు. ఇవి మా జ్ఞానాన్ని పెంచేందుకు సహకరిస్తున్నాయి. కొత్తగా డిగ్రీలో చేరే విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలోకి వస్తే బాగుంటుంది.
– జీ హర్షిత, బీకాం (మెట్పల్లి)
బంగారు భవిష్యత్తుకు మార్గనిర్దేశనం
కాలేజీలో నాణ్యమైన బోధన చేస్తున్నాం. బోధన, పరిశోధన, బంగారు భవిష్యత్తుకు మార్గనిర్దేశనం అన్న లక్ష్యంతో కృషి చేస్తున్నాం. పరిశోధన చేసిన అధ్యాపకులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల సూచనలతో ఇక్కడి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఏర్పడే అన్ని అవకాశాలున్నాయి. బాంబే సంస్థతో కోచింగ్, బొటానికల్ సంస్థతో ఎంవోయూ, ఐసీఐసీఐతో కొలాబరేషన్ ఇవన్నీ విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకే.. కాలేజీలో మూడేండ్లలో విద్యార్థులకు సరైన మార్గదర్శనం చేసి వారికి ఉత్తమ భవిష్యత్తును కల్పించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.
– డాక్టర్ పడాల తిరుపతి, వృక్షశాస్త్ర అధ్యాపకుడు
అత్యుత్తమ బోధన
మా కాలేజీ అత్యుత్తమ బోధనకు పెట్టింది పేరు. లెక్చరర్లు చాలా అద్భుతంగా బోధిస్తున్నారు. కాలేజీలో చేరే సమయంలో చాలా మంది భయపెట్టారు. ప్రభుత్వ కాలేజీల్లో బోధన జరగదు.. లెక్చరర్లు పట్టించుకోరు అన్నా రు. అయినా, ధైర్యం చేసి చేరాం. తర్వాత తెలిసింది. ప్రభుత్వ కాలేజీల్లోనే నిజమైన విద్య ఉందని అర్థమైంది. పరిశోధనలు పూర్తి చేసిన లెక్చరర్లు అంకిత భావంతో బోధిస్తున్నారు. ప్రతి విషయంలో మార్గదర్శనం చేస్తున్నారు. ఉన్నత చదువులకు, పరిశోధనలపై మాకు ఆసక్తిని కల్పించేలా వారి బోధన ఉంది. మా పట్ల అంత ప్రేమాభిమానాలను చూపుతూ, బోధన చేస్తున్న లెక్చరర్లందరికీ రుణపడి ఉంటాం.
–పీ హారిక, బీఎస్సీ (రాంపూర్)
హాస్టల్ వసతితోనే చదువుకు అవకాశం
ఇక్కడ హాస్టల్ వసతి ఉండటంతోనే నాకు చదువుకునే అవకాశం లభించింది. మాది కడెం. ఇంటర్ తర్వాత చదువు మానేసే పరిస్థితి. ఈ నేపథ్యంలో జగిత్యాల డిగ్రీ కాలేజీలో హాస్టల్ ఉందని తెలిసింది. ఇక్కడికి వచ్చి వివరాలు తెలుసుకొని కాలేజీలో చేరా. ఇక్కడే ఉండి చదువుకుంటున్నా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డిగ్రీ పూర్తి చేస్తున్నా. కాలేజీతో పాటు, హాస్టల్లోనూ అన్ని సౌకర్యాలున్నాయి. నాణ్యమైన బోధన చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటా. బోర్నపల్లి వంతెన వేయడంతో నేను జగిత్యాలకు వచ్చి చదువుకునే అవకాశం దక్కింది. లేకుంటే డిగ్రీ చదవడం ఒక కలగానే మిగిలిపోయేది. – గుగులోత్ సుజాత, బీఏ (కడెం)
విద్యార్థులకు అన్ని సౌకర్యాలున్నాయి
విద్యార్థులకు కాలేజీలో అన్ని విద్యా సౌకర్యాలున్నాయి. విశాలమైన తరగతి గదులతోపాటు అధునాతన ప్రయోగశాలలు, గ్రంథాలయం, జిమ్ వంటి వసతులున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పూర్తి రక్షణతో కాలేజీ ఆవరణలోనే హాస్టల్ వసతి ఉన్నది. నిపుణులైన అధ్యాపకులు ఉన్నారు. పిల్లల మేలు కోసం పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రత్యేక శిక్షణ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కాలేజీలో అదనపు సీట్లతోపాటు పీజీ కోర్సుల మంజూరు కోసం కృషి చేస్తున్నాం. ఇక్కడ ఉన్న సౌకర్యాలను తల్లిదండ్రులు గుర్తించి ఉచితంగా ఉత్తమ విద్యను అందిస్తున్న కాలేజీకి పిల్లలను పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– డాక్టర్ యాంసాని సత్యనారాయణ, ప్రిన్సిపాల్
అవకాశాలను వినియోగించుకోవాలి
అన్నివర్గాల విద్యార్థులకు కాలేజీలో సౌకర్యాలు ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియంతోపాటు బీఏ ఉర్దూ మీడియంలోనూ బోధన జరుగుతున్నది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. కాలేజీలోని ప్రతి విద్యార్థిపై ఫోకస్ పెట్టి వారి ఉత్తమ భవిష్యత్తుకు ప్రయత్నాలు చేస్తున్నాం. నాణ్యమైన బోధనతోపాటు పిల్లలకు లైఫ్స్కిల్స్ నేర్పుతున్నాం. ప్రభు త్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను వినియోగించుకోవాలి.
– డాక్టర్ మస్రూర్ సుల్తానా, వైస్ ప్రిన్సిపాల్