ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోందని, అమరవీరులు,దేవుళ్లను కూడా వివాదాల్లోకి లాగుతున్నారంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదివారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ కుటుంబం పై మాట్లాడే అర్హత కాంగ్రెస్కు ఏమాత్రం లేదని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వంపై కాంగ్రెస్ పదే పదే అవినీతి ఆరోపణలు చేస్తోందని, వాళ్ల దగ్గర అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థల దగ్గరకు ఎందుకు వెళ్లడం లేదని సూటిగా ప్రశ్నించారు. అసలు రాహుల్ గాంధీ కి పోరాట పటిమే లేదని విమర్శించారు.
వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ అంటూ.. రైతుల పట్ల మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని మండిపడ్డారు. ఛత్తీస్ ఘడ్ లో రైతులకు రెండు గంటల కరెంటు రావడం లేదని, రుణమాఫీ కూడా లేదన్నారు. ఇక.. అమరవీరుల స్థూపం ముందు నుంచే వెళ్లిన రాహుల్ గాంధీ… కనీసం నివాళులు కూడా అర్పించలేదని బాల్క సుమన్ విమర్శించారు. కనీసం నివాళులు అర్పించలేని కాంగ్రెస్కు, అమరవీరులు,అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్లి, అవినీతి విమర్శలు చేస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. అమరవీరుల స్థూపం మొత్తం ఖర్చు 177 కోట్లు అని, ఇందులో పన్నులే 27 కోట్లు అని ఆయన వెల్లడించారు. ఇప్పటికి 100కోట్ల పనులు జరిగాయన్నారు. అకాల వర్షాల వల్ల యాదాద్రి లో పనుల్లో ఇబ్బందులు వస్తే అవినీతి అంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.