పోడు భూముల సమస్య పరిష్కారానికి మరో అడుగు ముందుకుపడింది. ఏళ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల్లో ఆశలు చిగురించేలా రాష్ట్ర సర్కారు మరో నిర్ణయం తీసుకున్నది. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రకటించి ఏజెన్సీవాసుల్లో సీఎం కేసీఆర్ ధైర్యం నింపగా.., గతేడాది నవంబర్లో గ్రామగ్రామాన అధికారులు సదస్సులు నిర్వహించి పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే అధికారుల అంచనాకు మించి 1,08,397ఎకరాలకు 32,694 మంది గిరిజన, గిరిజనేతర రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సర్కారు ఈ నెల 11న మరో జీవో జారీ చేసింది. దీని ప్రకారం పోడు సమస్య పరిష్కారం కోసం జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీ, దీని ఆధారంగా మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. జిల్లాస్థాయి సమన్వయ కమిటీకి మంత్రి సత్యవతిరాథోడ్ చైర్మన్గా, కలెక్టర్ శశాంక కన్వీనర్గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలు అటవీ భూముల రక్షణతోపాటు పోడు భూములను గుర్తించి పట్టాలు ఇచ్చేలా కృషి చేయనున్నాయి.
బయ్యారం, సెప్టెంబర్13 : పోడు రైతుల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఏళ్లుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గిరిజనుల పోడు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తున్నది. గత ప్రభుత్వాలు పోడు రైతుల గోడును పట్టించుకోలేదు. సమస్య పరిష్కారం కోసం కనీసం ఆలోచన కూడా చేయలేదు. కాగా, స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు రైతుల గోడు తీర్చి, పట్టాలు అందజేయాలని నిర్ణయించింది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్ స్వయం గా ప్రకటించి, గిరిజనుల్లో ధైర్యం నింపారు. అన్నమాటకు కట్టుబడి గతేడాది నవంబర్ నెలలో గ్రామ గ్రామాన సదస్సులు పెట్టిన అధికారులు పోడు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు తాజాగా ఈ నెల 11న కొత్త జీవోను జారీ చేసింది. దీని ప్రకారం పోడు సమస్య శాశ్వత పరిష్కారం కోసం జిల్లాస్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారు. కమిటీకి చైర్మన్గా జిల్లా మంత్రి సత్యవతిరాథోడ్, కన్వీనర్గా కలెక్టర్ శశాంక వ్యవహరించనున్నారు. మున్సిపల్ కమిషన్ర్, ఎస్పీ, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్, డీఎఫ్వో, డీఆర్డీవో, డీటీడీవో సభ్యులుగా, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్ ఆహ్వానిత సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఆధారంగా మండల, గ్రామస్థాయిల్లో కూడా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేస్తారు. అటవీ భూముల సంరక్షణతోపాటు పోడు భూములను గుర్తించి పట్టాలు ఇచ్చేలా కృషి చేయనున్నాయి.
ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ
పోడు సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం గత నవంబర్ 8 నుంచి 20 వరకు గ్రామాల్లో సదస్సు లు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. అర్హులైన వారికి మాత్రమే న్యాయం జరిగేలా గ్రామాల్లో ని పెద్దలతో ఎఫ్ఆర్సీ(ఫారెస్ట్ రైట్స్ కమిటీ)లు ఏర్పాటు చేసి, వారి వాంగ్మూలాన్ని దరఖాస్తుకు జతచేసి, సంబంధిత బీట్ ఆఫీసర్, వీఆర్వో, జీపీ సెక్రటరీ ఆధ్వర్యంలో సర్పంచ్ల సమక్షంలో స్వీకరించారు. జిల్లాలోని బయ్యారం, గార్ల, కొత్తగూడ, గంగారం, గూడూరు, కేసముద్రం, కురవి, నెల్లికుదురు, మహబుబాబాద్ మండలాల్లో ఎక్కువగా పోడు దారులున్నారు.
2006వ సంవత్సరంలో కూడా జిల్లాలో 15వేల ఎకరాల పోడు భూమికి హక్కు పత్రాలు ఇవ్వగా, సుమారు 93వేల ఎకరాల్లో పోడు జరిగినట్లు అప్పట్లో అధికారులు అంచనా వేశారు. కాగా, ప్రస్తుతం అధికారుల అం చనా మించి 1,08,397 ఎకరాలకు గాను 32,694మంది గిరిజన, గిరిజనేతర రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో కొత్తగూడ మండలంలో 8617మంది రైతులు 35,347.02 ఎకరాలకు అత్యధికంగా, కురవి మండలంలో అత్యల్పంగా 53 మంది 129.26 ఎకరాలకు దరఖాస్తు చేసుకున్నారు. పోడు సమస్యకు రాష్ట్ర సర్కా రు శాశ్వత పరిష్కారం చూపుతుండడంతో గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన గ్రామాల్లో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఇప్పటికే పోడు భూ ములకు పట్టాలిచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించిన సర్కారు.., మరో అడుగు ముందుకు వేసి సమస్య పరిష్కారానికి జిల్లా, మండల, గ్రామస్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుకు జీవో జారీ చేయడంతో ఏజెన్సీ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి పోడుకు పరిష్కారం చూపుతుండడంతో ఇక నుంచి ఏటా వ్యవసాయ సీజన్లో అటవీశాఖకు పోడు రైతులకు మధ్య జరిగే వివాదాలకు చెక్ పడుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
పోడు సమస్య పరిష్కారం కోసం జీవో 140 జారీ చేయడాన్ని హర్షిస్తూ మంగళవారం మండలంలోని బయ్యారం, కొత్తపేట, గౌరారం గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరిప్రియానాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల అద్యక్షుడు తాత గణేశ్, ఎంపీపీ మౌనిక మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు పట్టాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, వారి సమస్యకు పరిష్కారం చూపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించి జీవో జారీచేయడం సంతోషకరమైని విషయమని అన్నారు. గిరిజన రైతులుకు హక్కు పత్రాలు లేక రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు వర్తించడం లేదని, పోడు సమస్య తీరితే గిరిజనులకు రైతుబంధు వస్తుందని హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హరిప్రియానాయక్కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమత, కోటమ్మ, వైస్ చైర్మన్ సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, ఉపాధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కోశాధికారి సుధాకర్రెడ్డి, నాయకులు నాగేందర్, రేపాకుల వెంకన్న, లక్ష్మణ్, శ్రీనునాయక్, రవి, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.