హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం సాధ్యమైన చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం గ్రీన్కో సంస్థ ప్రతినిధులు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేశ్కుమార్కు అందజేశారు. గ్రీన్కో సంస్థ ప్రభుత్వానికి అందజేసేందుకు చైనా నుంచి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను దిగుమతి చేసుకుంది. కార్గో విమానంలో శంషాబాద్ చేరగా.. వాటిని విమానాశ్రయంలోనే కంపెనీ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తోడుగా నిలిచి, 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన గ్రీన్కో సంస్థకు మంత్రి కేటీఆర్, సీఎస్ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మహమ్మారి కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా నియంత్రణకు ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన రోగులకు సైతం చికిత్సలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్, ఔషధాల సరఫరా పెంచాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు.