రూ.5 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
పంచాయతీ రాజ్ రోడ్లకు 55 కోట్ల నష్టం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధిక నష్టం
పురపాలికల్లో 310 బృందాల ఏర్పాటు
క్షేత్రస్థాయిలో 1105 మంది అధికారులు
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపిలేని వర్షాలకు వచ్చిన భారీ వరదలతో రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లు, బ్రిడ్జిలపై వాగులు ఉప్పొం గడంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. రాకపోకల కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. మంగళవారం సాయం త్రం వరకు వరద తీవ్రతను బట్టి జాతీయ రహదారు లు 25 చోట్ల, రాష్ట్రీయ రహదారులు 63 చోట్ల దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి, కొన్ని చోట్ల తెగిపోయాయి. తక్షణ మరమ్మతులకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేసింది. వరద తీవ్రత తగ్గిన ప్రాంతాల్లో మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. మట్టి కట్టలు పోసి తాత్కాలిక రాకపోకలు కల్పిస్తున్నారు.
అత్యవసర బృందాల ఏర్పాటు
జీహెచ్ఎంసీ మినహా మిగిలిన 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో వరద ప్రభావంపై 310 అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. మాసబ్ ట్యాంక్లోని సీడీఎంఏ కార్యాలయంలో 24 గంటలపాటు కంట్రోల్ రూం పనిచేస్తున్నది. 040-23120410 నంబర్కు పట్టణ ప్రాంత ప్రజలు కాల్ చేయవచ్చని సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ తెలిపారు. 1105 మంది అధికారులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కోసం నియమించామని చెప్పారు. 1,004 ప్రాంతాలను వరద బాధిత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. కూలిపోవడానికి, శిథిలావస్థలో ఉన్న 992 భవనాలను గుర్తించి తొలగించారు. వాటిలో నివసించే వారిని సురక్షిత భవనాలకు తరలించారు. వర్షపు, మురుగు నీరు సులువుగా వెళ్లే విధంగా 15,077 కిలోమీటర్ల మేర మురుగు, వర్షపు కాలువల్లో పూడిక తీశారు. నీరు ఎక్కువ నిలిచి ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యే 3,526 ప్రాంతాలను గుర్తించి మొరం వేసి సరిచేశారు. 2,374 సెల్లార్లతో కూడిన అపార్ట్మెంట్లు ఉన్నట్లు గుర్తించి అక్కడి ప్యానెల్ బోర్డులను సురక్షిత ప్రాంతానికి మార్చి విద్యుత్తు ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్ కాకుండా చర్యలు తీసుకొన్నారు. వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలకు రాష్ట్ర స్థాయి మున్సిపల్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు.
పీఆర్ రోడ్లకు రూ.55 కోట్లు నష్టం
వర్షాల వల్ల దాదాపు 171 పంచాయతీ రోడ్లకు దాదాపు రూ.54.96 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనావేశారు. పంచాయతీరాజ్ భవనాలకు రూ.3.28 కోట్ల నష్టం జరిగిందని లెక్కలువేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికంగా రూ.13.98 కోట్ల మేర నష్టం జరిగినట్టు అధికారులు తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లకు సంబంధించి సమస్యలు ఎదురైతే సమాచారం తెలపడానికి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఎన్సీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు ఈఎన్సీ సంజీవరావు తెలిపారు. 91211-36425 నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. రవాణా సౌకర్యం బంద్ కావడం, రోడ్ల తెగిపోవడం లాంటి వాటిపై కంట్రోల్ రూంకు తెలపాలని చెప్పారు.