ఇప్పటికే అందుబాటులో విత్తనాలు
ఎరువుల కోసం ఇండెంట్ పంపిన అధికారులు
కల్తీపై ఉక్కుపాదం
రైతులు వడి వడిగా వానకాలం సాగుకు సన్నద్ధ్దమవుతున్నారు. ఇప్పుడిప్పుడే చిన్నా చితకా పనులు మొదలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడం, బావులు, బోర్లలో భూగర్భ జలాలు వృద్ధి చెందుతుండడంతో వరి సాగు అంచనాలను దాటుతున్నది. అయితే, అధికారుల సూచనలతో ఈసారి చాలామంది రైతులు ఇతర పంటలవైపు మెగ్గుచూపుతున్నారు. ఈ నెలలో వర్షాలు అనుకూలిస్తున్న నేపథ్యంలో పంటల సాగు పుంజుకొంటుందని అధికారులు చెబుతున్నారు.
రాజన్న సిరిసిల్ల మే 17, (నమస్తే తెలంగాణ) : జిల్లా ఒకప్పుడు కరువు నేల. 625 చెరువులున్నా చుక్కనీరుండని దైన్యం. ఈ ప్రాంత రైతాంగం వ్యవసాయ పనులు లేక బతుకు దెరువు కోసం వలస బాట పట్టిన వైనం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్త ఆశలు రేకెత్తాయి. గోదావరి జలాలతో మెట్టను అభిషేకిస్తానన్న మున్సిపల్ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో జిల్లాలోని చెరువులు, ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. మండు టెండల్లో మానేరు మత్తళ్లు దూకింది. పంట చేలు సస్యశ్యామలంగా మారాయి. గతంలో 91,566 ఎకరాలకే పరిమితమైన జిల్లా సాగు అంచనా నేడు 2.65 లక్షలకు పెరిగి వ్యవసాయం పండుగ వాతావరణంలో సాగుతుంది.
అత్యధికంగా వరి సాగు
ఉమ్మడి ప్రభుత్వ హయాంలో జిల్లాలో మొత్తం పంటల సాగు 60 వేల ఎకరాలు దాటలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుబిడ్డ కేసీఆర్ తీసుకున్న చొరవతో మిషన్ కాకతీయ పనుల ద్వారా చెరువుల్లో నీరు చేరి బీడు భూములు సైతం సాగులోకి వచ్చి పంట విస్తీర్ణం 2.65 లక్షల ఎకరాలకు పెరిగింది. మొదటి ప్రాధాన్యత వరికే ఇస్తున్నారు. అందులో భాగంగా 1.45 లక్షల వరి పంట సాగుకు అంచనా వేశారు. ద్వితీయ పంటగా పత్తి 98 వేల ఎకరాలు సాగుకు లెక్క కట్టారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఈ వానకాలంలో 5 వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగుకు రైతులు ముందుకొచ్చి, ప్రత్యామ్నాయ పంటల వైపు అడుగులేస్తున్నారు. మరో 5 వేల ఎకరాల్లో పెసర, అనుములు, మినుములు, 5 వేలు మొక్కజొన్న, రెండు వేలలో ఇతర పంటలు, ఉద్యాన పంటలు 4500 ఎకరాల్లో సాగుకు అంచనా వేశారు.
సన్న వడ్ల సాగుపై దృష్టి
దొడ్డురకం వరి సాగు చేస్తున్న రైతులంతా ఇప్పుడు సన్న వడ్లవైపు దృష్టిసారిస్తున్నారు. తమ అవసరాల కోసం మాత్రమే సాగు చేసుకునే రైతులు, మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సన్న వడ్లను సాగు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా గత వానకాలంలో 1.30 లక్షల దొడ్డు రకం వడ్లు సాగు చేయగా, ఈ ఏడు 1.45 లక్షలకు పెంచారు. సింహభాగం సన్న వడ్లను పండించాలని నిర్ణయం తీసుకుంటున్నారు.
కల్తీపై ఉక్కుపాదం
పంటల సీజన్ వచ్చిందంటే చాలు మార్కెట్లో కల్తీ విత్తనాల విక్రయాలు జోరందుకుంటాయి. రైతులకు నష్టం జరుగకుండా ఉండేందుకు ప్రభుత్వం వ్యవసాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటు చేసింది. టాస్క్ఫోర్సు అధికారులు నిరంతరం దాడులు చేయడం వల్ల కల్తీ విత్తనాల అమ్మకాలు తగ్గు ముఖం పట్టాయి. 5వేల ఎకరాలకు ప్రత్యేక అధికారిని నియమించడం వల్ల రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. వానకాలం సీజన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో సాగు అంచనాలు సిద్ధం చేసిన అధికారులు విత్తనాలు కూడా అందుబాటులో ఉంచారు. 30 వేల క్వింటాళ్ల వరి, 200 క్వింటాళ్లు మొక్కజొన్న, పెసర 200 క్వింటాళ్లు, పత్తి 2 లక్షల ప్యాకెట్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సాగు అంచనా ప్రకారం యూరియా కోసం అధికారులు ఇండెంట్ పంపించారు. 32 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 6 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 15 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 5 వేల మెట్రిక్ టన్నుల మోనోపాజ్ తెప్పిస్తున్నారు.
సన్నబియ్యం సాగుజేస్తున్న..
దొడ్డు బియ్యానికి మార్కెట్లో రేటు తక్కువస్త్తున్నది. సన్నబియ్యానికి డిమాండ్ బాగుంది. సర్కారు స్కూళ్లల్లో సన్నిబియ్యంతోనే భోజనం పెడుతున్నరు. అందుకే నాకున్న 5 ఎకరాల్లో మొన్న యాసంగిలో రెండెకరాలు సన్నవడ్లేసిన. వానకాలంలో మొత్తం సన్నవి వేద్దామనుకుంటున్నా. ఎప్పుడు ఇంటి మందమే సన్నవి పండించుకునోటోళ్లం. సర్కారు కొంటే అందరూ సన్న వడ్లే ఏత్తరు.
– నర్సయ్య, రైతు బల్యాలనగర్, సిరిసిల్ల