న్యూఢిల్లీ: చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఘటనపై త్రివిధ దళాలతో దర్యాప్తు జరుపుతున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ నేతృత్వంలోని త్రివిధ దళాల దర్యాప్తు బృందం బుధవారమే వెల్లింగ్టన్కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించిందని చెప్పారు. సైనిక హెలికాప్టర్ ప్రమాదంపై ట్రై-సర్వీస్ విచారణకు భారత వైమానిక దళం ఆదేశించిందని రాజ్నాథ్ సింగ్ లోక్సభలో గురువారం తెలిపారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామని చెప్పారు. ఇతర సైనిక సిబ్బంది అంతిమ సంస్కారాలు కూడా తగిన సైనిక గౌరవాలతో జరుగుతాయని వెల్లడించారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన రావత్, ఆయన భార్య మధులికతోపాటు మరో 11 మంది భౌతిక కాయాలు గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంటాయని వివరించారు.
ప్రాణాలతో బయటపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ప్రస్తుతం వెల్లింగ్టన్లోని సైనిక ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు లోక్సభకు వెల్లడించారు. అనంతరం సభ్యులు నిలబడి రెండు నిమిషాలు మౌనం పాటించి సైనిక హెలికాప్టర్ ప్రమాద మృతులకు నివాళి అర్పించారు.