న్యూఢిల్లీ: కరోనా టీకా రెండో, ప్రికాషన్ డోసు మధ్య గ్యాప్ను కేంద్ర ప్రభుత్వం తగ్గించడం లేదు. ఈ రెండు టీకాల మధ్య వ్యవధి 9 నెలలు కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు, ప్రికాషన్ డోసుగా కేంద్రం పేర్కొనే బూస్టర్ డోసు మధ్య గ్యాప్ను ప్రభుత్వం ఆరు నెలలకు తగ్గించవచ్చంటూ ఇటీవల ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
అయితే శుక్రవారం నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. దేశంలో కరోనా కేసులు, వ్యాప్తి తీవ్రత పెద్దగా లేనట్లు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండో, ముందు జాగ్రత్త డోసు మధ్య ప్రస్తుతం ఉన్న 9 నెలల గ్యాప్ను కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో కరోనా టీకా రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు మాత్రమే ప్రికాషన్ డోసుకు అర్హులని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
మరోవైపు కరోనా టీకా డోస్ల మధ్య గ్యాప్పై వైద్య నిఫుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. గ్యాప్ ఎక్కువగా ఉంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుందని కొందరు వాదిస్తున్నారు. అయితే టీకాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా పనిచేస్తుందని మరి కొందరు అంటున్నారు. ఇప్పటికే రెండు డోసులు పొందిన వారిలో రోగ నిరోధకత బాగానే ఉన్నదని, అలాంటి వారికి ప్రికాషన్ డోసు ఇచ్చినా తేడా ఏమి ఉండదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోవిడ్ నేషనల్ టాస్క్ఫోర్స్ కో-ఛైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ పేర్కొన్నారు.
కాగా, ఏప్రిల్ 10 నుంచి ప్రికాషన్ డోసును ప్రైవేట్ ఆసుపత్రుల్లో సొంత ఖర్చలతో పొందవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే సుమారు 3.55 కోట్ల మంది అర్హుల్లో ఇప్పటి వరకు ఏడు లక్షల లోపు మాత్రమే ప్రికాషన్ డోసు తీసుకున్నట్లు డేటా ద్వారా తెలుస్తున్నది.