ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు
తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు: సోమేశ్కుమార్
హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎలాంటి లాక్డౌన్ విధించడం లేదని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్ స్పష్టం చేశారు. లాక్డౌన్ విధిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తెలంగాణలో ఈ నెల 30 వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు అన్ని రకాల షాపులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు గురువారం ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక ఫేక్ జీవో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన సీఎస్ సోమేశ్కుమార్.. అది ఫేక్ జీవో అని స్పష్టం చేశారు. లాక్డౌన్పై ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే ఆలోచన ఏమీ లేదని మరోసారి స్పష్టం చేశారు.