IDBI Bank | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చేనెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనున్నది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని పెండింగ్ సమస్యలు ఉన్నాయి. వాటిపై ఆర్బీఐ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)లతో చర్చించాల్సిన అవసరం ఉంది. సెప్టెంబర్ నాటికి ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్-ఈవోఐ) కోసం బిడ్లను ఆహ్వానిస్తామని ఆశాభావంతో ఉన్నాం` అని ఓ అధికారి తెలిపారు. బ్యాంకింగ్, ఈక్విటీ మార్కెట్ల నియంత్రణ సంస్థలు ఆర్బీఐ, సెబీలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.
`బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటీకరించనున్న తొలి బ్యాంకు ఐడీబీఐ బ్యాంక్లో వాటాల కొనుగోలుకు ఇన్వెస్టర్ల నుంచి భారీగా బిడ్లు దాఖలవుతాయని మేం విశ్వసిస్తున్నాం. ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్లు ఆహ్వానిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటాల విక్రయం పూర్తి కాకపోవచ్చు` అని ఆ అధికారి పీటీఐకి చెప్పారు. గతేడాది మే నెలలోనే ఐడీబీఐ బ్యాంకులో వాటాల విక్రయంతోపాటు యాజమాన్య నియంత్రణ హక్కులను బదిలీ చేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) సూత్రప్రాయంగా ఆమోదించింది.
ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)కి 49.24 వాటాలు ఉన్నాయి. విక్రయించతలపెట్టిన వ్యూహాత్మక వాటా ఎంత అన్నది ఖరారు కాలేదు. కొనుగోలుదారు (కన్సార్టియం)కు ఓపెన్ ఆఫర్ వంటి పలు సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది` అని అధికారులు తెలిపారు. ఎల్ఐసీతోపాటు కేంద్ర ప్రభుత్వం తమ వాటాల విక్రయంపై నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.65 వేల కోట్ల వాటాల ఉపసంహరణ లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు రూ.24,544 కోట్ల నిధులు సేకరించింది కేంద్రం.