చెన్నై: కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారుకు తమిళ సంస్కృతిపై గౌరవం లేదని, కానీ తమిళనాడులో వారు చెప్పిందల్లా చేసిపెట్టే ఒక సీఎం మాత్రం ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ విమర్శించారు. అసెంంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహించిన రాహుల్గాంధీ.. సీఎం పళనిస్వామి రాష్ట్రానికి ప్రతినిధిగా వ్యవహరించడం లేదని, ప్రధాని మోదీకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. కేవలం ప్రధాని మోదీ ముందు మాత్రమే వంగివంగి దండాలు పెట్టే వ్యక్తి.. రాష్ట్రం మొత్తానికి ప్రతినిధిగా వ్యవహరించడం సాధ్యం కాదని రాహుల్ పేర్కొన్నారు.
బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ తమిళ సంస్కృతిని కించపర్చిన సీఎం పళనిస్వామి పట్టించుకోడని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘ప్రధాని మోదీ ఒకే దేశం, ఒకే చరిత్ర, ఒకే సంస్కృతి అని చెబుతుంటాడు. తమిళ భాష భారతీయ భాష కాదా..? తమిళ చరిత్ర భారతీయ చరిత్ర కాదా..? తమిళ సంస్కృతి భారతీయ సంస్కృతి కాదా..?’ అని ఆయన ప్రశ్నించారు. ఒక భారతీయుడిగా తమిళ సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.