న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 100 రోజులకుపైగా ఆందోళన కొనసాగిస్తున్నా తమ సమస్యల గురించి మాట్లాడని ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బెంగాల్కు వెళ్లడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోనే ఉండే ప్రధానికి ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న మాతో మాట్లాడటానికి సమయం దొరకలేదుగానీ, పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు మాత్రం సమయం దొరికిందని రైతు సంఘాల నేతలు విమర్శించారు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం పశ్చిమబెంగాల్కు తరలిపోయిందని, అందుకే తాము కూడా ఈ నెల 13న బెంగాల్కు వెళ్లాలని నిర్ణయించుకున్నామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. మార్చి 13న బెంగాల్కు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడుతామని, ఎన్నికల్లో ఏం చేయాలో వాళ్లే నిర్ణయించుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.