న్యూఢిల్లీ, జూలై 16: ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ ను బీజేపీ ఎంపిక చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన చేశారు. జాట్ వర్గానికి చెందిన ధన్ఖడ్ను ఎంపిక చేయడం ద్వారా రాజస్థాన్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ వర్గం ఓటర్లను మచ్చిక చేసుకుని లబ్ధి పొందాలని బీజేపీ చూస్తున్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. పైగా పశ్చిమబెంగాల్ సీఎంతో తరచూ విబేధిస్తూ ఆమెను ఇరుకున పెట్టినందుకు బహుమతిగా ఈ పదవి ఇస్తున్నారంటూ మరికొందరు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ధర్నా చేపట్టినా కూడా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు.
ఇదీ ఆయన నేపథ్యం..
1951 మే 18న రాజస్థాన్లోని జుంజును జిల్లా కిథానా గ్రామంలో జన్మించారు. జైపూర్లోని మహారాజా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి, రాజస్థాన్ యూనివర్సిటీలో న్యాయశాస్త్రం విద్యనభ్యసించారు. 1979లో రాజస్థాన్ బార్ కౌన్సిల్ మెంబర్గా నమోదు చేసుకున్నారు. చాలా ఏండ్ల పాటు రాజస్థాన్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. 1990 నుంచి సుప్రీం కోర్టులో కేసులు వాదించేవారు. 1989లో ఆయన జుంజును స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 1990లో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1993లతో రాజస్థాన్లోని అజ్మీర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నుంచి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా విధులు నిర్వర్తిసున్నారు. ఆయనకు భార్య సుదేశ్ ధన్ఖడ్, కూతురు కామ్నా ఉన్నారు.
వివాదాలకు కేంద్రబిందువు
ఎన్డీయే తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన ధన్ఖడ్ చాలా వివాదాస్పదుడని పలువురు చెబుతుంటారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ప్రభుత్వాన్ని అడుగడుగునా ఇరుకునపెడుతూ తరచూ వార్తల్లో నిలిచేవారు. రూ.200 కోట్ల కుంభకోణమైన ‘జైన్ హవాలా’ కేసులో ధన్ఖడ్ హస్తం ఉన్నదంటూ జర్నలిస్టు వినీత్ నారాయణ్ ఫిర్యాదు కూడా చేశారు. హవాలా ద్వారా ఉగ్రవాదులకు పెద్ద మొత్తంలో డబ్బు అందినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని అప్పట్లో సీఎం మమతా బెనర్జీ కూడా లేవనెత్తారు. ఆయనో అవినీతిపరుడని, జైన్ హవాలా కేసులో చార్జిషీటులో ధన్కర్ పేరు ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ పదవికి ధన్ఖడ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఉప రాష్ట్రపతి ఎంపికలో దక్షిణాదికి మొండి చెయ్యి
హైదరాబాద్, జూలై 16, (నమస్తే తెలంగాణ): దక్షిణాది పట్ల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి తన వివక్షను ప్రదర్శించింది. ఉప రాష్ట్రపతిగా దక్షిణాది వ్యక్తిని ఎంపిక చేయనున్నట్టు ఇంతకాలం ఊరించిన బీజేపీ చివరకు ఉత్తరాది వ్యక్తినే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి దక్షిణాది వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతిగా ఉన్న దక్షిణాదికి చెందిన వెంకయ్యను కొనసాగిస్తారని, లేదంటే దక్షిణాదికి చెందిన మరొకరికి అవకాశం కల్పిస్తారని భావించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్రపతిగా ఉత్తరాదికి చెందిన వ్యక్తి ఉంటే దక్షిణాది వ్యక్తిని ఉప రాష్ట్రపతి చేసే సంప్రదాయాన్ని కొనసాగించారు. రెండు, మూడుసార్లు తప్ప ఈ సంప్రదాయమే కొనసాగుతూ వచ్చింది. కానీ మోదీ, షా ద్వయంలోని ఆదినుంచి దక్షిణాదిపై వివక్షను కనబరుస్తున్నట్టే ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలోనూ మరోసారి ప్రదర్శించారు. కాగా రాష్ట్రపతిగా ఎంపికైన వారంతా ఉపరాష్ట్రపతిగా ఉన్నవారికే అవకాశం కల్పించారు. వెంకయ్యఉపరాష్ట్రపతిగా ఉన్నా రాష్ట్రపతిగా అవకాశం కల్పించకపోగా కనీసం రెండో దశ కొనసాగించే అవకాశం కూడా కల్పించకుండా బీజేపీ నాయకత్వం వివక్ష కనబర్చింది.