సిద్దిపేట : కల్లుగీత కార్మికులందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్లుగీత కార్మికులకు లైసెన్సులు, కులవృత్తులను కాపాడేందుకు నిత్యం కృషిచేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
సిద్దిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో 529 మంది గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో రూ.5 కోట్లతో ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడ ఏసీ ఫంక్షన్ హాల్ నిర్మిస్తున్నామని, రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్లు, సొసైటీ పునరుద్ధరణ, కొత్త లైసెన్సులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గీ కార్మికులకు లైసెన్సులు దొరికేవి కావు. పైగా సొసైటీలు రద్దు చేసేవారని మంత్రి గుర్తు చేశారు. గీత కార్మికుల సంక్షేమం కోసం నిరంతంర కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఎనిమిదేండ్లలో గీత కార్మికులపై ఒక్కకేసు, వేధింపులు లేకుండా సేవలు అందించామని మంత్రి వివరించారు.
గీత కార్మికుడు మృతి చెందితే ఎక్స్ గ్రేషియాతో పాటు, 15 శాతం వైన్ షాపులలో రిజర్వేషన్లు తెచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అన్నారు. బడ్జెట్లో గౌడ కులస్తులకు వంద కోట్లు కేటాయించామన్నారు. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పై కావాలని కక్ష గట్టింది. అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు.
మత్స్య కార్మికులకు ఉన్న తరహాలో గీత కార్మికులకు ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలోనే సీఎం కేసీఆర్ తేనున్నారని మంత్రి వెల్లడించారు. అనంతరం సివిల్స్ లో 566వ ర్యాంకు సాధించిన కొండపాకకు చెందిన అఖిల్ యాదవ్ను అభినందించారు.