మంచిర్యాల : పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ మండలం పోక్కూరు గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ భారతి హోళి కేరితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో 44 లక్షల రూపాయలతో పలు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పొక్కూరు గ్రామ అభివృద్ధి కోసం 50లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తాం. పల్లె ప్రగతి స్ఫూర్తితో గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో ప్రజలకు మరింత సేవలు అందించడమే పల్లె ప్రగతి ఉద్దేశమన్నారు.
గత పాలకులు చెన్నూరు నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు గుజరాతీ గులామ్ గాల్లు .. ఢిల్లీ బానిసలు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రూ.1658 కోట్ల నిధులతో చేపట్టిన చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. గంగారం బ్రిడ్జి (1.97 కోట్లు ), కిష్టంపేట బ్రిడ్జి (3.50 కోట్లు), సుబ్బరాంపల్లి బ్రిడ్జి (4.80 కోట్లు) పనులు 90% శాతం మేరకు పూర్తయ్యాయి. రూ. 10 కోట్లతో సుద్దాల వాగుపై బ్రిడ్జి పనులు మొదలవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.