హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెడుతున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దసరా కానుకగా సింగరేణి కార్మికులకు లాభాల్లో 30 శాతం వాటా ఇవ్వాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్కు సింగరేణి కార్మికుల కుటుంబాల పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు సింగరేణి లాభా ల్లో 18 శాతం ఉన్న కార్మికుల వాటాను సీఎం కేసీఆర్ 30 శాతానికి పెంచారని, దేశంలో మరే సంస్థ ఈ స్థాయిలో కార్మికులకు లాభాల్లో వాటా ఇవ్వదని చెప్పారు. కార్మికుల నిరంతర శ్రమ, సీఎం కేసీఆర్ దూరదృష్టితో సింగరేణి రూ.32 వేల కోట్లకు పైగా టర్నోవర్ సాధించిందని పేర్కొన్నారు.
కేంద్రం కోల్ ఇండియా సహ సింగరేణికి ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ప్రైవేటీకరణ చేసే కుట్రలకు తెరలేపుతుంటే సీఎం కేసీఆర్ వాటిని పునరుద్ధరించాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదని, దశలవారీగా రిజర్వేషన్లను ఎత్తేయాలని చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీకి దేశాన్ని బాగుచేసే తెలివిలేదని, సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశం ఎదురుచూస్తున్నదని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు.