ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు, పార్టీ తరఫున 5 లక్షలు
చెక్కులు అందజేసిన మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్
ఖమ్మం, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన టీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభు త్వం తరఫున రూ.25 లక్షలు, పార్టీ తరఫున రూ.5 లక్షలు అందజేసి భరోసా కల్పించింది. గతేడాది అక్టోబర్లో పూర్వ ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన భీమేశ్వరరావును మావోయిస్టులు హతమార్చారు. భీమేశ్వరరావు చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా, అలుబాక టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని అప్పుడే ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ గురువారం హైదరాబాద్లో రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కులను అందజేశారు. పార్టీ శ్రేణులను గుండెల్లో పెట్టుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. భీమేశ్వరరావు కుమారుడు సాయికిరణ్కు ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, ఎమ్మెల్యే సండ్ర, వెంకటాపురం జడ్పీటీసీ రమణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంబాబు పాల్గొన్నారు.