షాబాద్ : సఫాయి కర్మచారుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ సభ్యురాలు అంజన పన్వార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని హరిత ప్లాజా గెస్ట్హౌస్లో జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్, జిల్లా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సాహెబ్ నగర్ పద్మావతి కాలనీలో వరదనీటి డ్రైనేజీ పూడీక తీత పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికులు శివయ్య, అంతయ్య మరణించడం దురదృష్టకరమన్నారు. ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ పనులను మ్యానువల్గా నిర్వహించకుండా మిషనరీతో చేపట్టాలని సూచించారు. అదే విధంగా మరణించిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కలెక్టర్కు సూచించారు. దీనిపై కలెక్టర్ అమయ్కుమార్ స్పందిస్తూ ఇప్పటికే ఆ కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరుతో పాటు వారికి తక్షణ సహాయం కింద ఒక్కొ కుటుంబానికి రూ. 4,12,500 ఆర్థిక సాయం అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో సఫాయి కర్మచారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న సఫాయి కర్మచారులకు వేతన స్లిప్, పిఎఫ్, ఇయస్ఐ, బీమా అందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్లు తెలిపారు. సఫాయి కర్మచారులు అశుభ్రమైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేయడం వలన వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని, వారు నివసించే ప్రాంతాల్లో ఏడాదికి రెండుసార్లు తప్పనిసరిగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యపరీక్షలు నిర్వహించాలని సూచించారు. సఫాయి కర్మచారులకు ఉపాధి కల్పనలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీస్ స్టేషన్లల్లో కర్మచారులను నియమించి వీరికి ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాలను అందించాలని ఆదేశించారు.
కర్మచారుల పిల్లలు చదువుకునే విధంగా వారికి అవగాహన కల్పించి సాంఘీక సంక్షేమ వసతి గృహల్లో ఉంచి చదువుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వారి పిల్లలు బాగా చదువుకుని ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అన్ని సంక్షేమ పథకాలు వారు సద్వినియోగపర్చుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ ప్రణాళిక కింద ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీ రుణాలు బ్యాంకుల ద్వారా అందిస్తే వారు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతాయని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, సైబరాబాద్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, రాచకొండ డీసీపీ సంప్రీత్సింగ్, ఏసీపీలు, సోషల్ వెల్ఫేర్ జేడీ శ్రీధర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి, జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సఫాయి కర్మచారుల సంఘాల నేతలు, సఫాయి కర్మచారులు పాల్గొన్నారు.