హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగు జోరందుకొన్నది. రైతులకు పెట్టుబడి సాయం ప్రభుత్వం రైతుబంధు నిధులను విడుదల చేస్తుండటంతో పనులు మొదలయ్యాయి. రైతుబంధు పంపిణీలో భాగంగా రెండురోజుల్లో 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎకరాలకు రూ.1820.75 కోట్ల సాయం అందింది. ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధం చేసుకొన్న రైతులు వరి నార్లు సైతం పోసుకొన్నారు.
పత్తి విత్తనాలు కూడా నాటారు. సకాలంలో వానలు సైతం కురుస్తుండటంతో సాగుపై భరోసాతో ఉన్నారు. మరోవైపు రైతుబంధు డబ్బులత ఎరువుల కొనుగోలుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 29.62 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగైనట్టు వ్యవసాయశాఖ బుధవారం వెల్లడించింది. అత్యధికంగా 22.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, వరి సాగు 46,788 ఎకరాల్లోనే జరిగింది. పత్తి సాగు మరింత పెరిగే అవకాశమున్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంతో పోల్చితే వరిసాగులో కాస్త తగ్గుదల నమోదయింది. గతేడాది ఇదే సమయానికి 72,313 ఎకరాల్లో వరి సాగు కాగా ప్రస్తుతం ఇది 46,788 ఎకరాలకే పరిమితమైంది. గత వానకాలంతో పోల్చితే ఈ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఈ నేపథ్యంలో పంటల సాగు కూడా నెమ్మదిగానే సాగుతున్నది. గతేడాది ఇదే సమయానికి 32.70 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు 29.62 లక్షల ఎకరాల్లోనే నాట్లు వేశారు.
తొలకరి ఆనలు వడ్డంక పత్తి, మక్కిత్తులు పెట్టి పైసల కోసం మా తిప్పలు వడేది. పండితెనా సరేసరి.. లేదంటే అప్పులు మీదవడి కమ్మలో, గాజులో అమ్మి బాకీ కట్టేది. కేసీఆర్ సారు వచ్చినంక అదునుకు పెట్టుబడి ఇచ్చుకుంట అసరైతాండు. మాకు ఊల్లె ఎకురంన్నర భూమున్నది. యాడాదికి పదిహేను వేలరూపాలు బ్యాంకుల వడుతున్నయ్. నాలుగేండ్లసంది రైతుబంధు అందుతాంది. అప్పటి నుంచి పానం నిమ్మలమైంది. ఎరువులు, పురుగుమందులు అల్కగ కొంటున్నం. కూలోళ్లకు సుత పైసలు ఎల్లుతున్నయ్. మా చెల్కల మొన్న పల్లికాయవెట్టినం. కాతకాత్తాంది. ఇంకో ఇరువై రోజుల్ల పంట అయిపోతది.. మళ్ల కూరగాయలో, దినుసులో పండిద్దామనుకుంటున్నం. ఆనకాలం సీజన్కు 7500 రూపాలు జమైనయ్. మా అసోంటి రైతులు మంచిగ బతకాల్నంటె సీఎం కేసీఆర్ సారు సల్లంగుండాలె.
ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన రైతులతో కిటకిటలాడుతున్న మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండలోని ఓ ఫర్టిలైజర్ దుకాణం
బుధవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంట-కమాన్పూర్ గ్రామాల మధ్యలో పొలంలో వరి నాటు వేస్తున్న మహిళా కూలీలు
మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలకేంద్రంలోని ఎస్బీఐ వినియోగదారుల కేంద్రంలో బుధవారం రైతుబంధు నగదు విత్డ్రా చేసుకొంటున్న వృద్ధురాలు
మహబూబ్నగర్ జిల్లాకేంద్రం సమీపంలోని హనుమాన్తండాలో ట్రాక్టర్తో పొలం దమ్ముచేస్తున్న రైతు