భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. వచ్చే నెల 22న టీమిండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తో ఒక మ్యాచ్ ఆడాలని కేంద్రం బీసీసీఐని కోరింది. భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా జరుపుతున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాల్లో భాగంగా ఈ మ్యాచ్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం బీసీసీఐకి ప్రతిపాదనలు పంపినట్టు తెలుస్తున్నది.
కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పటికే బీసీసీఐకి ప్రతిపాదనలు పంపిందని, ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అందులో కోరినట్టు పలు జాతీయ ఛానెళ్లలో కథనాలు వస్తున్నాయి. ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘అవును.. మేం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదన అందుకున్నాం. ఇండియా లెవన్ వర్సెస్ రెస్టాఫ్ ది వరల్డ్ లెవన్ తో ఆగస్టు 22 న మ్యాచ్ నిర్వహించాలని ప్రతిపాదన వచ్చింది..’ అని తెలిపాడు.
ఈ మ్యాచ్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వం చెప్పిన తేదీలో సాధ్యమయ్యే అవకాశమైతే లేదని సదరు బీసీసీఐ ప్రతినిధి చెప్పాడు. రెస్టాఫ్ ది వరల్డ్ అంటే వివిధ జట్ల నుంచి కనీసం 13-14 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండాలి. ఆ సమయానికి ఇంగ్లాండ్ లో కౌంటీలతో పాటు వెస్టిండీస్ లో కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్), ఇతరత్రా టోర్నీలు జరుగుతున్నందున ఆగస్టు లో ఈ మ్యాచ్ సాధ్యమయ్యే అవకాశాలు తక్కువని అతడు తెలిపాడు.
ఇతర దేశాల ఆటగాళ్ల సంగతి పక్కనబెడితే టీమిండియా ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువే ఉన్నాయి. ఆగస్టు మూడో వారంలో భారత జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంటుంది. అయితే ఈ సిరీస్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరు. కానీ
మిగిలినవారంతా జింబాబ్వేలోనే ఉంటారు. అదీగాక ఆగస్టు 27 నుంచి ఆసియా కప్ కూడా ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో సీనియర్ ప్లేయర్లు కూడా ఏమేరకు ఈ మ్యాచ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తారనేది ప్రశ్నార్థకం.
ఈ నెల బర్మింగ్హోమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడలలో భాగంగా జులై 26, 27 తేదీలలో అక్కడ ఐసీసీ సమావేశం జరగనుంది. అన్ని దేశాల క్రికెట్ బోర్డుల ప్రతినిధులు అక్కడికి వస్తారు. ఈ సమావేశంలో బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను చర్చకు పెట్టి ఆయా దేశాల ఆటగాళ్ల లభ్యతపై చర్చించనున్నదని బోర్డు వర్గాలు తెలిపాయి.