హైదరాబాద్ : తెలంగాణలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర అబ్కారీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల క్రీడాశాఖ మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. అన్ని జిల్లాల్లో క్రీడా అకాడమీలను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణను క్రీడాహబ్గా రూపొందించేందుకు సీఎం కేబినెట్ సబ్కమిటీని నియమించారన్నారు. క్రీడల సమగ్రాభివృద్ధి సాధించే దిశగా అత్యున్నతమైన నూతన క్రీడా విధానాన్ని ప్రకటించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇందు కోసం వివిధ దేశాల క్రీడా పాలసీలను అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధి, ప్రోత్సాహం కోసం క్రీడాకారులకు ఉద్యోగాల్లో 2శాతం, ఉన్నత విద్య కోసం 0.5శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లు చెప్పారు. ఖేలో ఇండియా కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఖేలో ఇండియా పోటీల్లో తెలంగాణ తరఫున 219 మంది క్రీడాకారులు పాల్గొని 53 మెడల్స్ సాధించినట్లు తెలిపారు. తెలంగాణలో మెదక్, కరీంనగర్, వరంగల్లో 400 మీటర్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబ్నగర్లో సింథటిక్ ట్రాక్ నిర్మాణం కోసం రూ.7.50 కోట్లు, సిద్దిపేటలో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం కోసం రూ.10 కోట్లు ప్రాధాన్యత ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించామన్నారు.
వీటితోపాటు అంతర్జాతీయ ప్రమాణాలైన షూటింగ్ రేంజ్, ఆక్వాటిక్స్, బ్యాడ్మింటన్, రెండు సింథటిక్ ట్రాక్స్, రెండు అస్ట్రో టర్ఫ్ హాకీ గ్రౌండ్స్తో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.52 కోట్లను మంజూరు చేయాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రతిపాదనలు సమర్పించామని, ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపాలని కోరారు. రాష్ట్రంలో కీడ్రల అభివృద్ధికి, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి కేటీఆర్ సూచనల మేరకు పారిశ్రామికవేత్తల సహకారంతో చర్యలు చేపట్టబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కరీంనగర్, ఆదిలాబాద్, హకీంపేటలో మూడు క్రీడా పాఠశాలున్నాయన్నారు. రాష్ట్రానికి మరో మూడు పాఠశాలలు కేటాయించాలని కోరారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను గుర్తించి వారిలో ప్రతిభను వెలికి తీస్తామన్నారు. సమావేశంలో క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాస రాజు, ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి పాల్గొన్నారు.