హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లి, తండ్రిగా వ్యవహరిస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వివిధ తీర్మానాల సందర్భంగా మాట్లాడుతూ.. ఒక సమావేశంలో తనను కలిసిన ఇద్దరు అనాథ బాలికలు గోడు వెళ్లబోసుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘తల్లిదండ్రులు, పట్టించుకొనే బంధువులు లేని ఆ ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలి? ఏం చేయాలి? నేను ఆ రోజంతా ఏడ్చా ను. నిద్రపోలేదు. దానికోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకొంటున్నాం. మంచి కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తం’ అని చెప్పారు. అనాథలకు రాష్ట్ర ప్రభుత్వమే తల్లి, తండ్రి కావాలన్న సీఎం.. ఆ రకమైన పాలసీని తీసుకోబోతున్నామని ప్రకటించారు. ప్రసంగం సీఎం మాటల్లోనే..
వందశాతం విజయవంతం
దళితబంధు 100 శాతం విజయం సాధిస్తాం. ఎమ్మెల్యే ఆనంద్ చెప్పినట్లుగా కుక్కను ఎక్కడ కట్టేయాలో, మేకను ఎక్కడ కట్టేయాలో ముఖ్యమంత్రికి కాదు.. ప్రజలకు తెలుసు. దళితజాతిలో ఎలాంటి రత్నాలు ఉన్నాయో, అవకాశమిస్తే ఎంత బాగా ఉంటుందో దళితబంధు గురించి మాట్లాడిన ఎమ్మెల్యే ఆనంద్, ఎంపీ వెంకటేశ్ చెప్పారు. మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సర్పంచ్గా పనిచేసిన కాలంలో వారి సొంత గ్రామంలో నలభై, యాభై లక్షలు విలువ చేసే పదెకరాల భూమిని దళితులకు ఇచ్చారు. ఆయనను అభినందిస్తున్నాను.
మహిళలకు అవకాశమివ్వాలి
మన దేశంలో ఎవడు పెట్టాడో పుణ్యాత్ముడు కానీ మహిళలు అనగానే వంటిట్లోనే ఉండాలి, వంటలు చేయాలి, మేం బాలాదూర్గా తిరగాలనే దుర్మార్గమైన ముచ్చట వచ్చింది. ప్రతిభావంతులైన మహిళలను ఎప్పటిదాక ముందు వరుసలో పెట్టమో, వాళ్ల ప్రతిభ చాటి చెప్పే అవకాశం ఇవ్వమో, అప్పటిదాకా ఈ దేశం బాగుపడదు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టుకున్నాం. కానీ వాళ్లను ఒంటరిగా పంపరు. వాళ్ల వెంట వాళ్ల భర్తలు వస్తారు. మహిళలను ప్రోత్సహించాలి, గౌరవించాలి. మనతో పాటు సమానంగా తీసుకొనిపోవాలి.