ఢిల్లీ ,జూన్ 3: దేశంలో కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలను నిర్ణయించేందుకు సాంకేతిక సమాచారం, సిఫార్సులను అందించడానికి నిపుణుల బృందాన్ని నియమిస్తూ కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ప్రకటన వచ్చిన నాటి నుంచి మూడేండ్ల పాటు ఈ బృందం పని చేస్తుంది.
ఈ బృందంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ డైరెక్టర్ ప్రొ.అజిత్ గుప్తా అధ్యక్షుడిగా, కోల్కతా ఐఐఎం ప్రొఫెసర్ తారిక చక్రబర్తి, ఎన్సీఏఈఆర్కు చెందిన డా.అనుశ్రీ సిన్హా, సంయుక్త కార్యదర్శి విభా భల్ల, వీవీజీఎన్ఎల్ఐ డైరెక్టర్ జనరల్ డా.హెచ్.శ్రీనివాస్ సభ్యులుగా ఉంటారు. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సలహాదారుడు డి.పి.ఎస్.నేగి మెంబర్ సెక్రటరీ గా వ్యవహరించనున్నారు.కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలపై ఈ నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. అంతర్జాతీయ ఉత్తమ వేతన పద్ధతులను పరిశీలించి, వేతనాలను నిర్ణయించేందుకు ఓ శాస్త్రీయ ప్రమాణంతోపాటు సరైన విధానాన్ని ఈ బృందం రూపొందిస్తుంది.