హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో బుధవారం నిర్వహించిన “గౌడ ఆశీర్వాద సభ” విజయవంతమైంది. ఈ సభకు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున గీతకార్మికులు, గౌడన్నలు హాజరయ్యారు. అనుకున్నదానికంటే ఎక్కువగా జనం హాజరు కావడంతో గులాబీ శిబిరంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నియోజక వర్గంలోని అన్ని గ్రామాల నుండి దాదాపు 15 వేల మందికి పైగా ఈ సభకు తరలివచ్చారు.
మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, తన్నీరు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు వి. సతీష్ కుమార్, వివేకానంద, టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్ది రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో గౌడన్నలు కదం తొక్కారు. ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్లో ఈ సభ జోష్ పెంచింది. గౌడ సామాజిక వర్గమంతా తమతోనే ఉందనే సంకేతాలు ఈ సభ ద్వారా టీఆర్ఎస్ ఇవ్వగలిగింది. టీఆర్ఎస్ గీత కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తోందని, తాటి చెట్లపై పన్నును పూర్తిగా రద్దు చేసిందని, అలాగే వైన్స్ షాపుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తోందని సభలో వక్తలతో పాటు మంత్రులు పేర్కొన్నారు. ఈ సందర్బంగా హాజరైన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసారు.
సి ఎం దళిత బంధు తర్వాత మరోసారి పెద్ద బహిరంగ సభను టీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. గౌడ సామజిక వర్గానికి చెందిన ఓట్లు భారీగా ఉండడం, రాష్ట్ర, జిల్లా, స్థానిక గౌడ నాయకత్వం సమన్వయంతో పని చేసి సభ సక్సెస్ కు కృషి చేసారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు గౌడ నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. గౌడ వేషధారణలో పలువురు గౌడన్నలు వేదిక వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని, గౌడ సామజిక వర్గం శీనుకు అండగా నిలవాలని పలువురు వక్తలు సభలో పిలుపునిచ్చారు. జై గౌడ, జై జై గౌడ, జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మార్కెట్ ప్రాంగణం మారుమోగిపోయింది.