ఉద్యోగ ప్రకటనపై ఎమ్మెల్సీ గోరటి కవితాత్మక ప్రశంస
హైదరాబాద్, మార్చి 9 : ‘ఎదమీది దిగులు బండ జరిగి బాధ తొలిగెనో.. నిరుద్యోగుల గుండెల్లో భరోసా పెరిగెనో’ అంటూ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కవితాత్మక ధోరణిలో ఉద్యోగ ప్రకటనను ప్రశంసించారు. పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నందుకు ఆయన నిరుద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నినాదాలను ఒకొకటిగా సాకారం చేస్తున్న పెద్దాయన సీఎం కేసీఆర్కు వందనాలు అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఉదాత్త హృదయానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఎవరి భాధనైనా తనబాధగా భావించే మానవీయమూర్తి కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ సకల వర్గాలు ఏమి ఆశించాయో… వాటిని ఓర్పు, నేర్పు, వ్యూహంతో నెరవేరుస్తున్నారని అన్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్పరం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇంత పెద్దఎత్తున ప్రకటించటం దేశానికే దిక్సూచి అని గోరటి వెంకన్న పేర్కొన్నారు.