న్యూయార్క్ : టెక్ దిగ్గజాలకు గడ్డుకాలం ఎదురవడంతో ఆయా కంపెనీలు ఉద్యోగుల ప్రయోజనాల్లో కోత విధించడంతో పాటు లేఆఫ్స్ పేరుతో ఏకంగా కొలువులకే ఎసరు పెడుతున్నాయి. స్లోడౌన్ భయాలతో సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతోంది. గూగుల్తో పాటు ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు ఇదే బాట పట్టడంతో టెకీల్లో గుబులు మొదలైంది. ఈ కంపెనీల సీఈవోల వ్యాఖ్యలు చూస్తుంటే ముందుముందు ఎలాంటి గడ్డు పరిస్ధితులు ఎదురవుతాయా అనే ఆందోళన నెలకొంది. ప్రోత్సాహకాలను కోరుతున్న ఉద్యోగులు ఉత్పాదకతపై మాత్రం దృష్టిసారించడం లేదని టెక్ సీఈవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక గూగుల్ ఇప్పటికే ఉద్యోగుల ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ బడ్జెట్లను కుదించింది. ఆర్ధిక మందగమనం, ద్రవ్యోల్బణం వంటి ఆర్ధిక సవాళ్లు ఎదురవుతున్న వేళ ఉద్యోగులు ప్రోత్సాహకాలను ఆశించరాదని సంకేతాలు పంపింది. ఉద్యోగులు సమర్ధంగా పనిచేయకపోతే భారీ లేఆఫ్స్ తప్పవని గూగుల్ ఇప్పటికే ఉద్యోగులను హెచ్చరించింది. ప్రోత్సాహకాలు, డబ్బు విషయం పక్కనపెట్టి ఉద్యోగాన్ని నిబద్ధతతో పనిని ఆస్వాదించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు తేల్చిచెప్పారు. మరోవైపు ఫేస్బుక్లోనూ ఉద్యోగులకు గడ్డుకాలం వెంటాడుతోంది.
ఎఫ్బీ, ఇన్స్టాగ్రాం, వాట్సాప్ల యాజమాన్యం మెటా టెకీల హైరింగ్ను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. సరైన పనితీరు కనబరచని ఉద్యోగుల జాబితాను రూపొందించినట్టు సమాచారం. వారిని కొత్త జాబ్ చూసుకోవాలని లేదా కంపెనీలో మెరుగైన ఉత్పాదకత కనబరచాలని కోరిందని చెబుతున్నారు. ఇక మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఉత్పాదకతపై ఉద్యోగుల పనితీరు పట్ల పెదవివిరుస్తోంది. ముఖ్యంగా ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు పనిపై ఫోకస్ పెంచాలని మేనేజర్లు కోరుతున్నారు. ఇక మైక్రోసాఫ్ట్ పునర్వ్యవస్ధీకరణ పేరుతో కొద్దినెలల కిందట 1800 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.