హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణలో కీలక ముందడుగు పడింది. సుప్రీంకోర్టులో క్రమబద్ధీకరణకు ప్రతిబంధంగా ఉన్న కేసు సోమవారం తొలగిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో-16ను జారీచేసింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగగా, గత ఏడాది అన్ని పిటిషన్లను కొట్టివేసింది. క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా మహబూబ్నగర్కు చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో 15637/22 స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఎస్ఎల్పీని డిస్మస్ చేసింది.
దీంతో కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు హర్షం వెలిబుచ్చారు. ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న నేతృత్వంలో నాంపల్లిలోని ఇంటర్ విద్యా కమిషనరేట్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అధ్యాపక సంఘాల నేతలు కొట్టిశెట్టి సురేశ్, కేపీ శోభన్బాబు, కుమార్, విజయ్మోహన్, గణపతి, హరగోపాల్, రవీందర్, విజయ్చందర్, రమేశ్, రాజు తదితరులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్కు ధన్యవాదాలు తెలిపారు.
క్రమబద్ధీకరణలో భాగంగా వొకేషనల్ అధ్యాపకుల జాబితా ఇటీవలే ప్రభుత్వానికి చేరింది. 360పైగా అర్హులైన వారితోపాటు ఇతరుల జాబితాలను ప్రభుత్వానికి పంపించారు. ఇతర రాష్ర్టాల్లో దూరవిద్య ద్వారా పీజీ పూర్తిచేసిన వారు.. ఉద్యోగంలో చేరేనాటికే వయోపరిమితి మించిన వారు.. ఉద్యోగంలో చేరేనాటికి పీజీ పూర్తిచేయకుండా తర్వాత పూర్తిచేసిన వారు.. ఇప్పటి వరకు సరైన అర్హతలు లేని వారి జాబితాలను వేర్వేరుగా రూపొందించి ప్రభుత్వానికి పంపించారు.