‘ఆడపిల్లల చదువు ఇంటికి వెలుగు.. మెరుగైన సమాజానికి పునాది.. పేదరికం కారణంగా వారు చదువు వదిలేయకూడదు. తమ జీవితాలను అంధకారం చేసుకోకూడదు..’ అనే సంకల్పంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు) అందుబాటులోకి వచ్చాయి.. ఇక్కడ చదివే విద్యార్థుల్లో డ్రాపౌట్స్తో పాటు తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన వారు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయిన వారు లేదా తల్లిదండ్రులు విడిపోయిన కుటుంబాల నుంచే ఉంటారు. వీరిలో సహజంగా భయం, బెరుకు ఉంటాయి. వారిలో స్ఫూర్తి నింపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. విద్యాలయ ఉపాధ్యాయులు వాటిని అమలు చేసి సత్ఫలితాలు సాధిస్తున్నారు.. ఇదే కోవలో న్యూ లక్ష్మీపురం (ముదిగొండ) విద్యాలయంలో చదివిన విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. వారిలో కొందరి అభిప్రాయాల మాలికతో ‘నమస్తే’ కథనం.
ముదిగొండ, ఆగస్టు 1: పేదరికం కారణంగా బాలికలు చదువును వదిలేయకూడదు. తమ జీవితాలను అంధకారం చేసుకోవద్దు.. అనే సంకల్పంతో నాటి ప్రభుత్వం కస్తూర్బా విద్యాలయాలను నెలకొల్పింది. దీనిలో భాగంగా మండలంలోని న్యూ లక్ష్మీపురం(ముదిగొండ)లో 2011లో విద్యాలయం రూపుదిద్దుకున్నది. అప్పుడు కేవలం 6 నుంచి 10వ తరగతి వరకే తరగతులు ఉండేవి. 2018లో విద్యాలయం జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ అయింది. పాఠశాల ఆవరణలో ప్రభుత్వం జూనియర్ కళాశాల భవనం నిర్మించింది. ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రవేశ పెట్టి 160 సీట్లు కేటాయించింది. ఒకప్పుడు విద్యాలయం బోసిపోయి ఉండేది. కస్తూర్బాలో చేరే విద్యార్థుల సంఖ్య అంతంతమాత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు విద్యాలయంలో 220 మంది చదువుతున్నారు. బోధన అంతా పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే. వచ్చే విద్యాసంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగనున్నది.
విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ..
మొదట్లో ‘బడి వద్దు.. చదువు వద్దు..’ అనే మానసిక స్థితిలో ఉన్న బాలికలు ఎక్కువ మంది విద్యాలయంలో చేరేవారు. వారి జీవితాలను మార్చుకోవడానికి ఉపాధ్యాయులు తోడ్పాటునందిస్తున్నారు. వారిలో స్ఫూర్తి నింపుతున్నారు. వారికి కేవలం పాఠ్యాంశాలే కాక జీవిత పాఠాలు నేర్పుతున్నారు. మార్షల్ ఆర్ట్స్, ఆటలు, గార్డెనింగ్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రిన్సిపాల్తోపాటు రోజుకో టీచర్ 24 గంటలు హాస్టల్లోనే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఇక్కడ చదివే బాలికల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులిద్దరూ చనిపోయిన వారు లేదా తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయిన వారు లేదా తల్లిదండ్రులు విడిపోయిన కుటుంబాల నుంచే ఉంటారు. వీరిలో సహజంగానే నిరాశ, నిస్పృహ ఉంటుంది. జీవితంలో వారు అనుభవించిన క్షోభను దూరం చేసేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపిస్తారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయులు ఐదేళ్ల పాటు మానిటరింగ్ చేస్తారు. వారితో మాట్లాడుతూ ఉంటారు. వీటన్నింటి కారణంగా విద్యార్థులు తమ జీవితాలను మార్చుకుంటూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు.
క్రాఫ్ట్స్ టీచర్గా పనిచేస్తున్నా..
మాది చిరుమర్రి గ్రామం. నేను 2011లో కస్తూర్బా విద్యాలయంలో 8వ తరగతి చేరా. అప్పుడు మామూలు విద్యార్థిని. చదువుపై శ్రద్ధ ఉండకపోయేది. టీచర్లు ప్రశ్నలు అడిగితే భయపడుతూనే సమాధానం చెప్పేదానిని. ఉపాధ్యాయులు మాపై ప్రత్యేక శ్రద్ధ చూపి మాలో భయాన్ని పోగొట్టారు. ఇదే స్ఫూర్తితో డిగ్రీ వరకూ చదివా. ఇప్పుడు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ టీచర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. కస్తూర్బాలో చదవడంతోనే జీవితంపై స్పష్టత వచ్చింది.
– వై.అనూష, పూర్వవిద్యార్థిని
బీటెక్ పూర్తి చేశా..
మాది నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామం. నేను 2013లో కస్తూర్బా విద్యాలయంలో 8వ తరగతిలో చేరా. నేను చదువులో వెనుకపడేదానిని. పాఠాలు అర్థమయ్యేవి కావు. హోం వర్క్ చేసే దానిని కాదు. ఉపాధ్యాయులు నాలో భయం పోయేలా ధైర్యం చెప్పారు. తర్వాత క్రమంగా చదువుపై ఏకాగ్రత పెరిగింది. పదో తరగతి తర్వాత పాల్టెక్నిక్లో చేరా. అనంతరం బీటెక్ పూర్తి చేశా. కస్తూర్బా విద్యాలయంలో చదవడంతోనే నాలో ఆత్మైస్థెర్యం నిండింది. సాఫ్ట్వేర్ జాబ్ సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటా.
– షేక్ హమీదా, పూర్వ విద్యార్థిని
క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కొలువు సాధించా.
మాది చింతకాని మండలం వందనం గ్రామం. నాన్న చనిపోగా అమ్మ మరో పెళ్లి చేసుకున్నది. నేను అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకున్నా. అప్పట్లో మానసికంగా కుమిలిపోయేదానిని. నేను 2012లో కస్తూర్బా విద్యాలయంలో 7వ తరగతిలో చేరా. మొదట్లో చాలా ఇబ్బందిపడ్డా. విద్యాలయం నుంచి వెళ్లిపోతానని బాగా ఏడ్చేదానిని. కానీ ఉపాధ్యాయులు నాలో ఆత్మైస్థెర్యాన్ని నింపారు. ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. ఇటీవల ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్కు సెలక్ట్ అయ్యా. చదువు పూర్తి కాగానే ఉద్యోగంలో చేరుతా. అమ్మమ్మ, తాతయ్యను బాగా చూసుకుంటా.
– బి.మహేశ్వరి, పూర్వవిద్యార్థిని
ఉపాధ్యాయురాలినవుతా..
మాది ముదిగొండ మండలం బాణాపురం. కొన్నేళ్ల కిత్రం కస్తూర్బా విద్యాలయంలో ఏడో తరగతిలో చేరా. మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగుండేవి కావు. విద్యాలయంలో చేరాక ఎంతో ముభావంగా ఉండేదానిని. భయం భయంగా ఉండేది. తర్వాత ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాగా చదువుకున్నా. పదోతరగతి పూర్తి చేశా. టీటీసీ పూర్తి చేసి తర్వాత డిగ్రీ చదివా. ఎలాగైనా ప్రభుత్వ ఉపాధ్యాయురాలినవుతా.
– భూక్యా చంద్రలేఖ, పూర్వవిద్యార్థిని
ప్రతి విద్యార్థిపై దృష్టి..
వసతి గృహం, విద్యాలయం ఒకటే కావడంతో మాకు విద్యార్థులతో అనుబంధం ఏర్పడుతుంది. వారితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. కస్తూర్బా విద్యాలయంలో చేరే పిల్లల్లో ఎక్కువ మంది నిరుపేద కుటుంబానికి చెందిన వారే. విద్యాలయంలో చేరగానే మేం వారి స్థితిగతులు తెలుసుకుంటాం. నిరాశలో ఉన్నవారికి కౌన్సిలింగ్ ఇస్తాం. వారికి కేవలం తరగతి పాఠాలే కాక వ్యక్తిత్వ వికాసం నేర్పిస్తాం. ఆటలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్లో ప్రోత్సహిస్తాం. వారిపై ఎలాంటి ఒత్తిడి ప్రభావం లేకుండా తీర్చిదిద్దుతాం. ప్రతి విద్యార్థినిపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటాం.
– బండారి ఇందిర, స్పెషల్ ఆఫీసర్