Gold Rates | బంగారం అంటే మన మహిళామణులకు ఎంతో ఇష్టం. ప్రతి పండక్కీ, వేడుకకి పిసరంత బంగారం కొనుక్కుని నచ్చిన ఆర్నమెంట్ చేయించుకోవాలని ఆశ పడుతుంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ది రెండో స్థానం.. కానీ ఈ దఫా పండుగల సీజన్లో బంగారం సరఫరా చేస్తున్న విదేశీ బ్యాంకులు.. భారతీయ వనితలకు షాక్ ఇచ్చాయి. చైనా, టర్కీ తదితర మార్కెట్లకు తరలిస్తున్నాయి. భారత్ కంటే ఆయా దేశాలే ఎక్కువ ప్రీమియం చెల్లిస్తుండటం దీనికి కారణం అని తెలుస్తున్నది. ఇండియాతో పోలిస్తే చైనా, టర్కీ వంటి దేశాల నుంచే ఎక్కువ లాభాలు వస్తున్నాయని సదరు బ్యాంకులు చెబుతున్నాయి. దీని ప్రభావంతో దేశంలో బంగారం ధరలు ధగధగమని మెరుస్తున్నాయి. అధిక ప్రీమియంతో కొనుగోలు చేసినప్పుడు దేశీయ మార్కెట్లో ధర పెంచి విక్రయించక తప్పదని ముంబైకి చెందిన జ్యువెల్లరీ వ్యాపారి ఒకరు తెలిపారు.
పండుగల సీజన్లో బంగారానికి గిరాకీ ఉండటం సాధారణమే. కానీ ఫెస్టివ్ సీజన్లో బంగారం సరఫరాలో కోత విధించడం దేశీయ బులియన్ వ్యాపారులకు కాసింత ఇబ్బందికర పరిణామమేనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే గిరాకీని అందుకోవడానికి వ్యాపారులు అధిక ప్రీమియం చెల్లించి బంగారం కొనాల్సి వస్తున్నది. అదే జరిగితే దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ధగధగమని పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఐసీబీసీ స్టాండర్డ్ బ్యాంక్, జేపీ మోర్గాన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి విదేశీ బ్యాంకులు భారత్కు ప్రధాన బంగారం సరఫరాచేస్తుంటాయి. మనం.. మన బులియన్ వ్యాపారులు సాధారణంగా ఫెస్టివల్ సీజన్లోనే ఎక్కువ బంగారం దిగుమతి చేసుకుంటూ ఉంటాం. ఏడాది క్రితంతో పోలిస్తే విదేశీ బ్యాంకుల వాలెట్లలో 10 శాతానికంటే తక్కువ బంగారం నిల్వలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం వాలెట్లలో కొన్ని టన్నుల బంగారం మాత్రమే ఉందని ముంబై కేంద్రంగా పని చేస్తున్న వాలెట్ అధికారి ఒకరు చెప్పారు. పండుగల సీజన్లో కొన్ని టన్నుల బంగారం వాలెట్లలో నిల్వ ఉంటుంది. దీనిపై స్పందించడానికి జేపీ మోర్గాన్, ఐసీబీసీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ల అధికార ప్రతినిధులు నిరాకరించారు.
కొవిడ్-19 మహమ్మారి ఉధృతంగా సాగిన వేళ కూడా చైనాలో బంగారంపై 20-45 డాలర్ల ప్రీమియం చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇక టర్కీలో ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అధిగమించేందుకు ఆ దేశ పౌరులు ఎక్కువగా బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. 80 డాలర్లు పే చేసి కొనుగోలు చేస్తున్నారు. చైనా, టర్కీ కొనుగోలుదారులు అధిక ప్రీమియం చెల్లించి బంగారం కొంటున్నారని ఓ బ్యాంక్ అధికారి చెప్పారు. కానీ, దీన్ని భారత్ మార్కెట్తో పోల్చలేమని వ్యాఖ్యానించారు.
గతేడాదితో పోలిస్తే గత నెలలో బంగారం దిగుమతులు 30 శాతం తగ్గి 68 టన్నులకు చేరాయి. టర్కీలో బంగారం దిగుమతులు 543 శాతం పెరిగాయి. హాంకాంగ్ మీదుగా ఆగస్టులో నాలుగేండ్ల నాటి కంటే 40 శాతం ఎక్కువ నికర బంగారం దిగుమతులు చేసుకుంది చైనా.
భారత్లో విజయదశమి, దీపావళి, దంతేరాస్ పండుగలను మహిళలు శుభసూచకంగా పరిగణిస్తారు. ఈ టైంలో బంగారం కొనుగోళ్లు మంచి చేస్తాయని భావిస్తున్నారు. పండుగల సీజన్ తర్వాత పెండ్లిండ్ల సీజన్లో అత్యధికంగా బంగారం కొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉంటాయి.