Gold in India | ధంతేరాస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుందని, తమ ఇంట్లో నడయాడుతుందని భారతీయ మహిళల విశ్వాసం. ప్రత్యేకించి హిందువులు, జైన్లు బంగారం కొనుగోలు చేయడంలో ముందు ఉంటారు. ప్రాచీన కాలం నుంచి బంగారానికి భారతీయులు పెద్దపీట వేస్తున్నారు. అంతేకాదు పుత్తడి పెట్టుబడి మార్గం కూడా. అందువల్లే ప్రపంచంలోనే బంగారం వినియోగిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో కొనసాగుతున్నది. మొదటి స్థానంలో చైనా నిలిచింది.
భారతీయుల ఇండ్లలో 2019లో 25 వేల టన్నులకు మించి బంగారం నిల్వలు ఉన్నాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక- 2021 చెబుతున్నది. 8000 టన్నులకు పైగా బంగారాన్ని అమెరికా ఖజానాలో అమెరికా ఆర్థికశాఖ డిపాజిట్ చేసిందని డబ్ల్యూజీసీ నివేదిక సారాంశం. అంటే అమెరికా ఖజానాలో ఉన్న బంగారం కంటే మూడు రెట్లకు పైగా భారతీయుల ఇండ్లలో పుత్తడి నిల్వలు ఉన్నాయన్నమాట.
2018 నుంచి క్రమంగా బంగారం రేట్లు పెరుగుతూ వచ్చాయి. 2018లో తులం 24 క్యారట్ల బంగారం ధర రూ. 31,400 పలికితే, 2019లో రూ. 35,300లకు దూసుకెళ్లింది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి ఉధృతమైనప్పుడు సురక్షిత ఇన్వెస్ట్మెంట్ మార్గంగా బంగారం నిలిచింది. ఫలితంగా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. 2020లో రూ.48,800లకు, 2021లో రూ.48,850 చేరుకుంది. 2020 ఆగస్టులో తులం 24 క్యారట్ల బంగారం ధర రూ. 54,930కి చేరుకుని ఆల్టైం రికార్డు పలికింది.
దేశ రాజధాని ఢిల్లీ, అహ్మదాబాద్, జైపూర్ల్లో రూ.54,930 పలికితే హైదరాబాద్లో రూ.54,040లకు చేరుకుంది. తర్వాత క్రమంగా దిగి వచ్చింది. గతేడాది నుంచి తులం బంగారం ధర రూ.52వేల మార్క్ వద్ద తచ్చాడుతున్నది. 2012లో రూ.31,025 మినహా 2011- 17 మధ్య తులం బంగారం రూ. 26 వేల మార్క్ వద్దే నిలిచింది.